కోవిడ్19కు భారతీయ సంప్రదాయ ఔషధాలను పరిశీలించాలి : డాక్టర్ అంబుమణి రామదాస్
ABN , First Publish Date - 2020-04-03T00:05:35+05:30 IST
ప్రపంచాన్ని వేధిస్తున్న కోవిడ్-19కు సంప్రదాయ భారతీయ ఔషధాలతో చికిత్స చేయడం గురించి పరిశీలించాలని
చెన్నై : ప్రపంచాన్ని వేధిస్తున్న కోవిడ్-19కు సంప్రదాయ భారతీయ ఔషధాలతో చికిత్స చేయడం గురించి పరిశీలించాలని మాజీ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అంబుమణి రామదాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తాను పాశ్చాత్య వైద్య విధానంలో వైద్యం చేసే వ్యక్తిని అయినప్పటికీ, భారతీయ సంప్రదాయ ఔషధాలతో కోవిడ్-19 రోగులకు చికిత్స చేయడంలో ఏదైనా తప్పు ఉన్నట్లు తనకు కనిపించడం లేదన్నారు. చైనాలో కోవిడ్-19 విపరీతంగా ఉన్నపుడు అక్కడివారు సంప్రదాయ చైనా మందులను, పాశ్చాత్య మందులను ఉపయోగించారని తెలిపారు.
అంబుమణి రామదాస్ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ విజ్ఞప్తి చేశారు. సంప్రదాయ భారతీయ ఔషధాలు డెంగ్యూ, మలేరియా, తదితర వ్యాధులను నయం చేయడంలో, నిరోధించడంలో ఎంతో ఉపయోగపడినట్లు తెలిపారు. కొందరు అధికారులకు సిద్ధ చికిత్సా విధానంపై తప్పుడు అభిప్రాయం ఉందన్నారు. ఈ తప్పుడు తలంపులు మారాలన్నారు. ఈ మహమ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని అనుసరించాలన్నారు.
ఇదిలావుండగా, చెన్నైలోని సిద్ధ, ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ థనికసలం వేణి ఈ ఏడాది జనవరిలో ఓ ప్రకటన చేశారు. తాను కరోనా వైరస్ వల్ల వచ్చే వ్యాధిని నయం చేయగలిగే మూలికా ఔషధాన్ని తయారు చేశానని ప్రకటించారు. తనకు సిద్ధ, ఆయుర్వేద వైద్య రంగంలో 25 ఏళ్ళ అనుభవం ఉందని చెప్పారు.