జమ్మూ, కశ్మీర్ పై అక్కసు వెళ్లగక్కిన చైనా

ABN , First Publish Date - 2020-08-05T23:04:56+05:30 IST

జమ్మూ, కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడంపై చైనా తన అక్కసును వెళ్లగక్కింది.

జమ్మూ, కశ్మీర్ పై అక్కసు వెళ్లగక్కిన చైనా

న్యూఢిల్లీ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసి నేటికి సరిగ్గా యేడాది. అంతేకాకుండా జమ్మూ, కశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించి కూడా నేటికి యేడాది. ఇన్ని రోజులు సరిహద్దుపై నానా రభస సృష్టించిన డ్రాగన్.. తాజాగా ఈ అంశంపై చైనా తన అక్కసును వెళ్లగక్కింది. ఇలా రెంటినీ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం చట్ట విరుద్ధమని, ఇలా ఏక పక్షంగా చేయడం చెల్లదని పేర్కొంది. కశ్మీర్ విషయంలో భారత్, పాక్ మధ్య తలెత్తిన విభేదాలను కేవలం చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది.


చైనా విదేశాంగ శాఖ కార్యదర్శి వాంగ్ వెన్‌బిన్ మాట్లాడుతూ... కశ్మీర్ పరిణామాలను తాము చాలా జాగ్రత్తగా గమనిస్తూనే  ఉన్నామని వెల్లడించారు. ‘‘కశ్మీర్ పరిణామాలను చాలా నిశితంగా గమనిస్తున్నాం. కశ్మీర్ విషయంలో మా వైఖరి చాలా స్పష్టంగా, స్థిరంగానే ఉంది. ఈ సమస్య ఇరు దేశాల చరిత్రలో మిగిలిపోయిన అంశం. యథాతథ స్థితిలో ఉన్న వాటిల్లో ఏ మార్పు చేసినా అది ఏకపక్షమే. చట్ట విరుద్ధమే. ఈ అంశాన్ని రెండు దేశాలూ శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి’’ అని ఆయన పేర్కొన్నారు.


భారత్, పాక్ రెండూ పొరుగు దేశాలేనని, దీనిని ఎవరూ కాదనలేని సత్యమని తెలిపారు. ఇలా రెండు దేశాలూ కలిసి ఉండటం ఈ రెండు దేశాల ప్రాథమిక ప్రయోజనాలకు, అంతర్జాతీయ సమాజ ఆకాంక్షలకు ఎంతో ఉపయోగమని వాంగ్ వెన్‌బిన్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-05T23:04:56+05:30 IST