చవకైన వినికిడి పరికరం
ABN , First Publish Date - 2020-09-25T07:28:13+05:30 IST
వినికిడి శక్తి కోల్పోయినవారి కోసం అత్యంత చవక ధరతో లభ్యమయ్యేలా వినికిడి పరికరాలను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు...
- ధర రూ.100లోపే.. 60-79 ఏళ్లవారికి ఉపయోగం
- అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు
వాషింగ్టన్, సెప్టెంబరు 24: వయసు సంబంధిత సమస్యలతో వినికిడి శక్తి కోల్పోయినవారి కోసం అత్యంత చవక ధరతో లభ్యమయ్యేలా వినికిడి పరికరాలను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘లోచ్ ఎయిడ్’ అనే ఈ ఆధునిక వినికిడి పరికరాలు వివిధ రకాల శబ్దాలను సర్దుబాటు చేసుకుంటాయి. ఇందుకుగాను పరికరంలో ప్రత్యేకంగా డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ల వ్యవస్థ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా వినికిడి సమస్యతో బాధపడుతున్న లక్షల మంది వయో వృద్ధులకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని జార్జియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన స్కూల్ ఆఫ్ కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సాద్ భామ్లా తెలిపారు. పెద్ద మొత్తంలో తీసుకుంటే ఒక్కో పరికరం ఒక డాలర్ లోపే (రూ.78) ఉంటుందని పేర్కొన్నారు. వినికిడి పరికరంలో భాగంగా ఇయర్ ఫోన్స్, కాయిన్-సెల్ బ్యాటరీలు, హోల్టర్ ఉంటాయి. వినికిడి సమస్యతో బాధపడుతున్న 60-79 ఏళ్ల పురుషులు, మహిళలకు ఈ పరికరం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.