నేవీలోకి సైలెంట్ కిల్లర్!
ABN , First Publish Date - 2021-11-26T08:56:52+05:30 IST
భారత నావికాదళంలోకి మరో శక్తిమంతమైన జలాంతర్గామి చేరింది. సముద్ర గర్భంలో తక్కువ శబ్ధం చేస్తూ శత్రు కదలికలను గుర్తించే సైలెంట్ కిల్లర్,
- విధుల్లో చేరిన ‘ఐఎన్ఎస్ వేలా’
ముంబై, నవంబరు 25: భారత నావికాదళంలోకి మరో శక్తిమంతమైన జలాంతర్గామి చేరింది. సముద్ర గర్భంలో తక్కువ శబ్ధం చేస్తూ శత్రు కదలికలను గుర్తించే సైలెంట్ కిల్లర్, స్కార్పీన్ శ్రేణికి చెందిన నాలుగో జలాంతర్గామి ‘ఐఎన్ఎస్ వేలా’ గురువారం విధుల్లోకి చేరింది. ముంబై తీరంలో జరిగిన కార్యక్రమం లో నేవీచీఫ్ అడ్మిరల్ కరమ్బీర్ సింగ్ చేతుల మీదుగా ‘వేలా’ను నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. ప్రాజెక్టు-75 పేరిట నిర్మిస్తున్న 6 జలాంతర్గాముల్లో ఇది నాలుగోది. ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ ఖండేరి, ఐఎన్ఎస్ కరంజ్ సబ్మెరైన్లు ఇప్పటికే జలప్రవేశం చేశాయి. తాజాగా అందుబాటులోకొచ్చిన వేలాను ఫ్రాన్స్కు చెందిన ఎంఎస్ నావల్ గ్రూప్ భాగస్వామ్యంతో స్కార్పీన్ శ్రేణి డిజైన్తో ముంబైలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ రూపొందించింది. 2019లో నిర్మాణం ప్రారంభం కాగా.. దీనికి గతంలో మూడు దశాబ్దాలకుపైగా (1973-2010) నేవీలో సేవలందించిన ‘వేలా’ పేరు పెట్టారు. వారం రోజుల వ్యవధిలోనే నేవీ అమ్ముల పొదిలో చేరిన రెండో ప్రధానాస్త్రం ఇది. ఈ నెల 21న అత్యాధునిక యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ విధుల్లోకి చేరగా.. తాజాగా ఐఎన్ఎస్ వేలా కూడా జలప్రవేశం చేసింది.