ఆగస్టులోగా అంతర్జాతీయ ప్రయాణాలు
ABN , First Publish Date - 2020-05-24T07:33:49+05:30 IST
ఆగస్టులోగా అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభమవుతాయని పౌర విమానయానశాఖ మంత్రి హర్దీ్పసింగ్ పురి వెల్లడించారు. శనివారం ఆయన ఫేస్బుక్ లైవ్లో...
- విమాన సర్వీసులను పునఃప్రారంభిస్తాం
- కరోనా టెస్ట్ చేయించుకోవాలి: హర్దీ్పసింగ్
న్యూఢిల్లీ, మే 23: ఆగస్టులోగా అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభమవుతాయని పౌర విమానయానశాఖ మంత్రి హర్దీ్పసింగ్ పురి వెల్లడించారు. శనివారం ఆయన ఫేస్బుక్ లైవ్లో మాట్లాడారు. ‘‘ఈనెల 25 నుంచి దేశీయ విమాన ప్రయాణాలు ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ విమాన సేవలు ఆగస్టులో ప్రారంభమవుతాయా? సెప్టెంబరులోనా? అని అడిగితే.. కచ్చితంగా ఆలోపే అంటాను’’ అని ఆయన వివరించారు. దేశీయ విమాన ప్రయాణికులు తమ స్మార్ట్ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం తప్పనిసరి కాదంటూనే మెలికపెట్టారు. ‘‘ఆరోగ్యసేతును డౌన్లోడ్ చేసుకున్న ప్రయాణికులు అందులో కరోనా టెస్ట్లో పాసైతే చాలు. అది తప్పనిసరి కాదు. కాకుంటే ఆ యాప్ వాడనివారు విమానాశ్రయాల్లో సెల్ఫ్డిక్లరేషన్ ఇవ్వాలి. ప్రయాణానికి 2, 3 రోజుల ముందే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. వాటి ఫలితాలను డిక్లరేషన్తో జతచేయాలి’’ అన్నారు. దేశీయ విమాన ప్రయాణాలపై కొన్నిరాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని, వాటన్నింటినీ కేం ద్రం పరిగణనలోకి తీసుకుంటుందని ఆయన చెప్పారు. ‘‘రాష్ట్రాల ఆందోళనను సీనియర్ మంత్రులకు చెప్పాలన్నాం. ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు’’ అన్నారు. ఆరోగ్యంగా ఉన్న వృద్ధులు కూడా దేశీయ ప్రయాణాలు చేయవచ్చన్నారు. ఇంతకుముందు పౌర విమానయాన శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో వృద్ధులు, 10 ఏళ్లలోపు చిన్నారులకు విమాన ప్రయాణాలకు అనుమతి లేదని పేర్కొన్న విషయం తెలిసిందే.