వెటర్నరీ వర్సిటీ ఆఫీసర్ల పోస్టులకు నేడు ఇంటర్వ్యూలు
ABN , First Publish Date - 2021-06-19T06:19:53+05:30 IST
తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో ఖాళీగా ఉన్న ఐదు ఆఫీసర్ల పోస్టులకు శనివారం పరిపాలనా భవనంలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి.
తిరుపతి(విద్య), జూన్ 18: తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో ఖాళీగా ఉన్న ఐదు ఆఫీసర్ల పోస్టులకు శనివారం పరిపాలనా భవనంలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. వర్సిటీ రిజిస్ర్టార్, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్, డెయిరీ సైన్స్ డీన్, ఫిషరీస్ డీన్ పోస్టుల భర్తీకి ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది అక్టోబరులో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించగా.. దాదాపు 14మంది ప్రొఫెసర్ల నుంచి 24 దరఖాస్తులు వచ్చాయి. సింగిల్పాయింట్ పోస్టులు కావడంతో వీటికి రోస్టర్ అమలులో ఉండదు. మెరిట్ ప్రాతిపదికన పోస్టులను భర్తీచేయనున్నారు. కాగా.. వర్సిటీ వీసీగా పద్మనాభరెడ్డి బాధ్యతలు చేపట్టాక తొమ్మిది నెలల పాటు ఇన్చార్జ్ అధికారులను నియమించారు. వీరి పదవీకాలం ఈనెల 30న ముగియనుంది. ఈ నేపథ్యంలో వర్సిటీ పాలన వ్యవస్థను మరింత సౌలభ్యవంతంగా నిర్వహించడానికి రెగ్యులర్ పోస్టుల భర్తీపై వీసీ దృష్టి సారించారు.
సీనియర్ ప్రొఫెసర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు
వెటర్నరీ వర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్ల పోస్టుల కోసం శుక్రవారం ఇంటర్య్వూలు నిర్వహించారు. 15మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేయగా స్ర్కూటినీ చేసి అర్హత ఉన్న 13మందిని పదోన్నతికి ఎంపిక చేసినట్లు సమాచారం. రానున్న బోర్డులో ఈ పోస్టులకు అప్రూవల్ తీసుకుని, వీరికి పదోన్నతి కల్పించనున్నారు. దీంతో వీరి గ్రేడ్ పేస్కేల్ మారనుంది. కాగా.. ఈ పోస్టులకు పది రీసెర్చ్ ఆర్టికల్, పదేళ్ల యాక్టివ్ సర్వీస్, ఇద్దరి విద్యార్థులకు గైడెన్స్ చేసినవారిని ఎంపిక చేసినట్లు సమాచారం.