వారసత్వ ఉద్యోగం అడిగితే తప్పా?
ABN , First Publish Date - 2022-07-27T06:04:34+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో నాలుగు ఉద్యోగాలు సంపాదించుకుంటే లేనిదీ వీఆర్ఏలు వారసత్వ ఉద్యోగం అడిగితే తప్పా? అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత కేకే మహేందర్రెడ్డి ప్రశ్నించారు.
ఎల్లారెడ్డిపేట, జూలై 26: ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో నాలుగు ఉద్యోగాలు సంపాదించుకుంటే లేనిదీ వీఆర్ఏలు వారసత్వ ఉద్యోగం అడిగితే తప్పా? అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత కేకే మహేందర్రెడ్డి ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. కేకే మహేందర్రెడ్డి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ శాసన సభ సాక్షిగా వీఆర్ఏలకు పే స్కేల్ అందజేస్తామని రెండు సార్లు ప్రకటించి మాట తప్పారన్నారు. వీఆర్ఏలకు తమ పార్టీ సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తోందన్నారు. నాయకులు నర్సయ్య, గౌస్, లింగాగౌడ్, లక్ష్మారెడ్డి, దేవయ్య, బుచ్చాగౌడ్, బా బు, బాలయ్య, రాజునాయక్, శ్రీనివాస్, పోచయ్య, రవి, దత్తాద్రిగౌడ్, విజయ్రెడ్డి, జుబేర్ పాల్గొన్నారు.
ఇల్లంతకుంట: తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన రిలే నిరాహారదీక్ష మంగళవారం కొనసాగింది. అధ్యక్షుడు పంతంగి ప్రభాకర్, ప్రధానకార్యదర్శి పుట్ట శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
గంభీరావుపేట: గంభీరావుపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు నిరవధిక సమ్మె చేపట్టారు. పే స్కేల్ను వెంటనే అమలు చేయాలని, అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
వేములవాడ టౌన్: వీఆర్ఏల సమ్మె మూడో రోజుకు చేరింది. వేములవాడ పట్టణంలోని తెలం గాణ ధర్నా చౌక్ వద్ద వీఆర్ఏలు మంగళవారం దీక్ష చేపట్టారు. వీఆర్ఏల నాణ్యమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు.
చందుర్తి: పేస్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలని వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు దాసు డిమాండ్ చేశారు. చందుర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట చందుర్తి, రుద్రంగి మండలాల వీఆర్ఏలు మంగళవారం నిరవధిక సమ్మె చేపట్టారు.