అమర్నాథ్ రద్దయినా వైష్ణోదేవికి ఎందుకు అనుమతిచ్చారంటే...
ABN , First Publish Date - 2020-08-13T11:29:41+05:30 IST
జమ్ముకశ్మీర్లో జరిగే అమర్నాథ్ యాత్రను ప్రభుత్వం రద్దుచేసింది. అయితే ఇప్పుడు అదే జమ్ముకశ్మీర్లోని వైష్ణో దేవి ఆలయాన్ని భక్తుల సందర్శనార్థం తెరవనున్నారు. ఆగస్టు 16 నుంచి భక్తులు వైష్ణో దేవిని...
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో జరిగే అమర్నాథ్ యాత్రను ప్రభుత్వం రద్దుచేసింది. అయితే ఇప్పుడు అదే జమ్ముకశ్మీర్లోని వైష్ణో దేవి ఆలయాన్ని భక్తుల సందర్శనార్థం తెరవనున్నారు. ఆగస్టు 16 నుంచి భక్తులు వైష్ణో దేవిని సందర్శించుకోగలుగుతారు. దీంతో ఒకే రాష్ట్రంలోని అమర్నాథ్ యాత్ర ఎందుకు రద్దు చేశారు? వైష్ణో దేవి ఆలయాన్ని ఎందుకు తెరుస్తున్నారనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతోంది. ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం వెనుక అనేక కారణాలున్నాయి. అమర్నాథ్ పవిత్ర గుహ కశ్మీర్ లోయలో ఉంది. కశ్మీర్ లోయలో కంటే జమ్ము డివిజన్లో కరోనా కేసులు తక్కువ ఉన్నాయి. మరోవైపు కశ్మీర్ లోయలో భద్రత కూడా ఒక ప్రధాన సమస్య. శాశ్వత రహదారి నిర్మాణం లేకపోవడమే అమర్నాథ్ యాత్ర రద్దుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇక వైష్ణో దేవి దర్శనం విషయంలో జమ్ము ప్రభుత్వం జారీ చేసిన ఎస్ఓపీ ప్రకారం ప్రతిరోజు గరిష్టంగా 500 మంది భక్తులను అమ్మవారి సందర్శనకు అనుమతిస్తారు. అలాగే బయటి నుంచి వచ్చే ప్రతి భక్తునికి వైద్య పరీక్షలు చేయిస్తారు. యాత్ర నిర్వహణ పర్యవేక్షణకు తగినంతమంది సిబ్బంది ఉన్నారు. వైష్ణో దేవి యాత్రకు భద్రతా ఏర్పాట్లు పెద్ద సమస్య కాదు. వైష్ణో దేవి యాత్ర చేసే భక్తులకు కత్రా వరకూ రైలు సదుపాయం కూడా ఉంది.