బీజేపీతో పొత్తు కుదరకుంటే ఒంటరిపోరే: జేడీయూ

ABN , First Publish Date - 2021-08-08T23:43:40+05:30 IST

త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు తమ పార్టీ..

బీజేపీతో పొత్తు కుదరకుంటే ఒంటరిపోరే: జేడీయూ

న్యూఢిల్లీ: త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు తమ పార్టీ తొలి ప్రాధాన్యం ఇస్తుందని జనతాదళ్ (యునైటెడ్) జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి అన్నారు. ఒకవేళ పొత్తు కుదరని పక్షంలో జేడీయూ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తుందని చెప్పారు. అదివారంనాడిక్కడ మీడియాతో త్యాగి మాట్లాడుతూ, తమ పార్టీ మణిపూర్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పారు. పొత్తులపై ఆధారపడకుండా ఒంటరిగా పోటీ చేసే సత్తా జేడీయూకు ఉందని ఆ పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడు, పార్టీ ఎంపీ రాజీవ్ రంజన్ శనివారంనాడు ప్రకటించిన నేపథ్యంలో త్యాగి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


''జేడీయూను జాతీయ పార్టీగా తీర్చిదిద్దడం మా లక్ష్యం. మణిపూర్, ఉత్తరప్రదేశ్ పార్టీ నేతలతో నేను చర్చించాను. ఎన్డీయే భాగస్వాములతో కూడా చర్చలు జరుపుతాం. ఈ రెండు రాష్ట్రాల్లో జేడీయూను భాగస్వామిగా అంగీకరించకుంటే, ఒంటరిగానే ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందుతాం'' అని రాజీవ్ రంజన్ ఇటీవల పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ వ్యాఖ్యానించారు.


Updated Date - 2021-08-08T23:43:40+05:30 IST