నీటి కుంట ధ్వంసం
ABN , First Publish Date - 2020-07-08T10:45:30+05:30 IST
తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన కుంట కొందరు స్వార్థపరుల కారణంగా ధ్వంసమౌతోంది.
మట్టి కోసం అధికార పార్టీ నాయకుడి ఆగడం
కోవెలకుంట్ల, జూలై 7: తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన కుంట కొందరు స్వార్థపరుల కారణంగా ధ్వంసమౌతోంది. నీటి వనరులను కాపాడాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. కోవెలకుంట్ల మండలం కంపమల్ల గ్రామ సమీపంలో ఊరకుంట ఉంది. అన్ని రోజుల్లో పశుపక్షాదులకు, విద్యుత్ సమస్య ఉన్నప్పుడు ప్రజలకు ఈ కుంట నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఈ కుంట కట్టను తవ్వి పొలానికి మట్టిని తరలిస్తున్నాడు. ఏకంగా ఎక్స్కవేటర్ను పెట్టి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నాడు. మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ స్పందించి నీటి కుంటను పరిరక్షించాలని కోరుతున్నారు.
మట్టి తరలింపు వాస్తవమే
కుంట కట్ట మట్టిని తరలిస్తున్నట్లు ప్రజలు ఫిర్యాదు ఇచ్చారు. రెండు రోజుల్లో కట్టను పూడ్చివేస్తామని ఆ వ్యక్తి తెలిపారు. అలా చేయకపోతే కేసు నమోదు చేయిస్తాం.
- నవజీవన్ రెడ్డి, మైనర్ ఇరిగేషన్ ఏఈ