ప్రతీ పంచాయతీలో గిడ్డంగి
ABN , First Publish Date - 2020-12-05T04:10:31+05:30 IST
వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసే విధంగా ప్రతీ పంచాయతీలో గిడ్డంగుల నిర్మాణాలకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి అన్నారు.
జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరెడ్డి
పాడేరు, డిసెంబరు 4: వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసే విధంగా ప్రతీ పంచాయతీలో గిడ్డంగుల నిర్మాణాలకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి అన్నారు. శుక్రవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన వ్యవసాయ వర్క్షాపులో ఆయన మాట్లాడారు. వచ్చే సీజన్కు గిడ్డంగులు అందుబాటులోకి వస్తాయన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్ధ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. కొత్త పంటలు, విత్తన సేకరణ, విత్తన శుద్ధి, మార్కెటింగ్ సదుపాయాలు, మద్దతు ధరలు, సంప్రదాయ పంటలు, సస్యరక్షణ చర్యలు, ఆర్గానిక్ వ్యవసాయంపై శాస్త్రవేత్తలు పలు సూచనలు చేశారు.
అధిక దిగుబడులు సాధించేలా ప్రణాళికలు
ఏజెన్సీలో గిరిజన రైతులు అధిక దిగుబడులు సాధించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఐటీడీఏ పీవో ఎస్.వెంకటేశ్వర్ అన్నారు. ఏజెన్సీలో ఉన్న వాతావారణ పరిస్థితులకు అనుగుణంగా గిరిజన రైతులు అధిక దిగుబడులు సాధించి ఆర్థికాభివృద్ధి చెందాలన్నారు. గిరిజనులు స్థానికంగా వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడం వలన రైతులకు లాభాలు రావడం లేదన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.లక్ష్మీశివజ్యోతి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ లీలావతి, అసోసియేట్ డైరెక్టర్ డా.జి.రామారావు, శాస్త్రవేత్తలు డా.డి.శేఖర్, కె.మోహన్, డా.ఎన్.సతీశ్బాబు, వ్యవసాయ శాఖ ఏడీ కె.రత్నకుమారి, జి.నవీన్, పి.శ్రీధర్, పీఏవో భాస్కరరావు పాల్గొన్నారు.