7న సరిపల్లి పెంటయ్య మృతిపై న్యాయ విచారణ
ABN , First Publish Date - 2020-08-05T10:35:44+05:30 IST
సరిపల్లి పెంటయ్య మృతిని లాకప్ డెత్గా పరిగణించి న్యాయ విచారణ జరపనున్నట్టు రెవెన్యూ డివిజినల్ అధికారి ..
మహారాణిపేట, ఆగస్టు 4: సరిపల్లి పెంటయ్య మృతిని లాకప్ డెత్గా పరిగణించి న్యాయ విచారణ జరపనున్నట్టు రెవెన్యూ డివిజినల్ అధికారి పెంచల కిశోర్ తెలిపారు. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం గొడ్డువానిపాలేనికి చెందిన సరిపల్లి పెంటయ్యను విశాఖ కేంద్ర కారాగారం నుంచి ఈ ఏడాది జనవరి 28వ తేదీన చికిత్స నిమిత్తం కేజిహెచ్కి తరలించగా చికిత్స పొందుతూ ఫిబ్రవరి 4వ తేదీన మృతి చెందాడని తెలిపారు.
దీంతో అతని మృతిని లాకప్ డెత్గా నిర్ధారించామన్నారు. దీనిపై న్యాయ విచారణ జరిపేందుకు రెవెన్యూ డివిజినల్ అధికారి, సబ్డివిజినల్ మెజిస్ట్రేట్లను విచారణాధికారిగా నియమించినట్టు తెలిపారు. ఈ నెల 7వ తేదీ ఉదయం 11 గంటలకు ఆర్డీవో సబ్డివిజన్ మెజిస్టీరియల్ కార్యాలయంలో న్యాయ విచారణ జరపనున్నామన్నారు. పెంటయ్య మృతిపై వివరాలు తెలిసిన వారు విచారణకు హజరై లిఖితపూర్వకంగా గానీ, మౌఖికంగా గానీ తెలియజేయవచ్చని తెలిపారు.