కమల్‌నాథ్ ఇంటిలో హనుమాన్ చాలీసా పారాయణ

ABN , First Publish Date - 2020-08-04T20:11:11+05:30 IST

అయోధ్యలో రామాలయ నిర్మాణం, భూమిపూజను స్వాగతించిన కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ..

కమల్‌నాథ్ ఇంటిలో హనుమాన్ చాలీసా పారాయణ

భోపాల్: అయోధ్యలో రామాలయ నిర్మాణం, భూమిపూజను స్వాగతించిన కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మంగళవారంనాడు భోపాల్‌లోని తన నివాసంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయన స్వయంగా ఇందులో పాల్గొన్నారు. దీనిపై కమల్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం హనుమన్ చాలీసా పారాయణ నిర్వహించినట్టు చెప్పారు.


మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చిన విరాళాలతో కొనుగోలు చేసిన 11 వెండి ఇటుకలను అయోధ్యకు పంపిస్తున్నట్టు కమల్‌నాథ్ తెలిపారు. అయోధ్యలో  బుధవారంనాడు జరగనున్న ఆలయ భూమిపూజ కోసం యావద్దేశం ఎదురుచూస్తోందని, ఇది చరిత్రాత్మకమైన రోజు అని మాజీ సీఎం వ్యాఖ్యానించారు.


కాగా, ఇది శుభకార్యాలకు తగిన సమయం కాదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సిందిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ మోదీని ఇప్పటికే కోరిన నేపథ్యంలో కమల్‌నాథ్ స్వయంగా ఇది చారిత్రకమైన రోజని అభివర్ణించడంతో పాటు తన నివాసంలో హనుమాన్ చాలీసా పారాయణ జరిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - 2020-08-04T20:11:11+05:30 IST