రాష్ట్రంలో భిక్షాటన నిషేధ చట్టం

ABN , First Publish Date - 2022-07-20T17:34:39+05:30 IST

రాష్ట్రంలో భిక్షాటన నిషేధ చట్టాన్ని సంపూర్ణంగా అమల్లోకి తీసుకురానున్నట్టు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కోట శ్రీనివాసపూజారి ప్రకటించారు.

రాష్ట్రంలో భిక్షాటన నిషేధ చట్టం

                  - మంత్రి కోట శ్రీనివాసపూజారి 


బెంగళూరు, జూలై 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భిక్షాటన నిషేధ చట్టాన్ని సంపూర్ణంగా అమల్లోకి తీసుకురానున్నట్టు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కోట శ్రీనివాసపూజారి ప్రకటించారు. నగరంలో సోమవారం హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర, స్త్రీ శిశుసంక్షేమశాఖ మంత్రి హాలప్ప ఆచార్‌, కార్మికశాఖ మంత్రి శివరాం హెబ్బార్‌తో భిక్షాటన నిర్మూలన కోసం చేపట్టాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించారు. చిన్నారులను దివ్యాంగులుగా మార్చి మరీ భిక్షాటన కోసం వినియోగిస్తున్నారన్న నివేదికలు కలకలం సృష్టిస్తున్నాయన్నారు. భిక్షాటన  మాఫియాగా మారిందని, ఫలితంగా బాల నేరస్థులు పుట్టుకొస్తున్నట్టు గుర్తించామని సమావేశం అనంతరం మంత్రి మీడియాకు తెలిపారు. ఒక్క బెంగళూరు నగరంలోని 70 చోట్ల భిక్షాటన సాగుతోందని నివేదికలు తెలియచేస్తున్నాయన్నారు. గత కొద్ది నెలలుగా భిక్షాటన చేస్తున్న 101 మంది చిన్నారులను రక్షించి బాల పునరావాస కేంద్రానికి తరలించామన్నారు. న్యాయ సేవల ప్రాధికార ఇటీవల తమకు సమర్పించిన ఒక నివేదికలో బెంగళూరు నగరంలో 720 మంది చిన్నారులు భిక్షాటన చేస్తున్నట్టు తెలిసిందన్నారు. భిక్షాటన చేస్తున్న పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని 1098 నెంబరుకు పౌరులు అందచేస్తే తక్షణం చర్యలు తీసుకునేలా ఒక ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను సిద్ధం చేశామన్నారు. బెంగళూరు నగరంలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో భిక్షాటన చేస్తున్న చిన్నారుల తాజా సమాచారాన్ని అందచేయాల్సిందిగా పోలీసుశాఖకు సూచించామని హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర వెల్లడించారు. 

Updated Date - 2022-07-20T17:34:39+05:30 IST