నేత్రపర్వం... కార్తీక పౌర్ణమి దీపోత్సవం
ABN , First Publish Date - 2020-12-01T06:30:52+05:30 IST
కార్తీక పౌర్ణమి వేడుకలు సోమవారం జిల్లావ్యాప్తంగా నేత్రపర్వంగా జరిగాయి. ఆలయాలన్నీ భక్తజనంతో కిక్కిరిసి కనిపించాయి.
అనంతపురం టౌన్, నవంబరు 30: కార్తీక పౌర్ణమి వేడుకలు సోమవారం జిల్లావ్యాప్తంగా నేత్రపర్వంగా జరిగాయి. ఆలయాలన్నీ భక్తజనంతో కిక్కిరిసి కనిపించాయి. పురవీధులన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. నగరంలోని మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో పంచామృతాభిషేకాలు, రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేశారు. సాయంత్రం టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కోటిదీపోత్సవం నిర్వహించారు. ఆలయ ఈఓ సుధారాణి ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాత్రికి స్వామివారికి దశహారతులు సమర్పించిన అనంతరం ఊంజల్సేవ నిర్వహించారు. పాపంపేటలోని శివశక్తి ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా తపోవనంలోని చిన్మయా జగదీశ్వరాలయంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మురళీమోహన్రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. హెచ్చెల్సీ కాలనీలోని మంజునాథస్వామి దేవాలయంలో సాయంత్రం జ్వాలాతోరణం వెలిగించారు. ఆరో రోడ్డులోని అమృతలింగేశ్వరస్వామికి కార్తీకపౌర్ణమి పూజలను వైభవోపేతంగా నిర్వహించారు. శారదానగర్లోని శృంగేరి శంకరమఠం, కొత్తూరు, పాతూరు వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయాలు, మల్లేశ్వరరోడ్డులోని లక్ష్మీగణపతి మందిరం. శివకోటి దేవాలయం, పాతూరులోని విరూపాక్షేశ్వరాలయం, వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానం, అరవిందనగర్లోని సర్వేశ్వరాలయం, హౌసింగ్బోర్డు వెంకటేశ్వరస్వామి, హెచ్చెల్సీకాలనీలోని నసనకోట ముత్యాలమ్మ దేవాలయంలతో పాటు అన్ని ప్రాంతాల్లోని శివాలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి.