కేజ్రీవాల్‌ని రెండు వారాలకోసారి చాయ్‌కి పిలవండి : సిసోడియా

ABN , First Publish Date - 2021-04-10T22:02:13+05:30 IST

అభివృద్ధి పట్ల దార్శనికత ఉన్న ఏకైక నాయకుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రమేనని ...

కేజ్రీవాల్‌ని రెండు వారాలకోసారి చాయ్‌కి పిలవండి : సిసోడియా

న్యూఢిల్లీ: అభివృద్ధి పట్ల దార్శనికత ఉన్న ఏకైక నాయకుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రమేనని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు. సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు చేపట్టాల్సిన పథకాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆయనతో చర్చించాలని సిసోడియా సూచించారు. ఇవాళ జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.  ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలు ‘‘కేజ్రీవాల్ మోడల్’’ పాలన అందిస్తామని హామీ ఇస్తున్నాయన్నారు. ‘‘దేశంలో విజన్ ఉన్న నాయకుడు ఒక్క కేజ్రీవాల్ మాత్రమే. సామాన్య ప్రజలు ఎదుర్కొనే సమస్యలను , వారి అవసరాలను ఆయన అర్థం చేసుకోగలరు. వారి అభివృద్ధి కోసం పనిచేయగలరు. దేశాన్ని సరైన మార్గంలో నడిపించగల సామర్థ్యం ఆయనకు ఉంది. ఇతర పార్టీలు కూడా ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నాయి. ఆయన ఏదైనా మాట ఇస్తే.. అది చేసి చూపిస్తారు..’’ అని సిసోడియా పేర్కొన్నారు. 


ప్రధాని నరేంద్రమోదీ కేజ్రీవాల్ నుంచి అభిప్రాయాలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేజ్రీవాల్‌ నుంచి అభిప్రాయాలు తీసుకుంటారని ఆశిస్తున్నా. దేశంలోని సామాన్య ప్రజల అభివృద్ధి కోసం ఎలాంటి పథకాలు చేపట్టాలన్న దానిపై 15 రోజులకోసారి కేజ్రీవాల్‌ను ‘‘చాయ్’’కి పిలవాలి..’’ అని ఆయన సూచించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించేందుకు ఇప్పుడు ఢిల్లీ ఓ లాబొరేటరీగా తయారైందన్నారు. ‘‘200 యూనిట్లవరకు ప్రజలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. తదితర పథాకాలను ఇప్పుడు దేశంలో ఎన్నికలు జరుగుతున్న ఇతర రాష్ట్రాలన్నీ ఈ పథకాలను అమలు చేస్తామంటూ హామీ ఇస్తున్నాయి..’’ ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-10T22:02:13+05:30 IST