ఫిబ్రవరి 1 నుంచి ఇంటి వద్దకే రేషన్
ABN , First Publish Date - 2021-01-21T05:57:57+05:30 IST
ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎన్నడూ లేని విధంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నామని, ఫిబ్రవరి 1 నుంచి ఇంటి వద్దనే కార్డుదారులకు రేషన్ను డెలివరీ చేస్తారని పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు.
నేడు 2,500 వాహనాలు పంపిణీ చేయనున్న సీఎం జగన్
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వెల్లడి
గుడివాడ, జనవరి 20: ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎన్నడూ లేని విధంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నామని, ఫిబ్రవరి 1 నుంచి ఇంటి వద్దనే కార్డుదారులకు రేషన్ను డెలివరీ చేస్తారని పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. బుధవారం స్థానిక రాజేంద్రనగర్లోని తన నివాసంలో మంత్రి కొడాలి నాని విలేకరులతో మాట్లాడుతూ కార్డుదారులకు ఇంటి వద్దే నాణ్యమైన బియ్యం, నిత్యావసర వస్తువులను మొబైల్ వాహనాల ద్వారా పంపిణీ చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 21వ తేదీ ఉదయం 10.25 గంటలకు విజయవాడ బెంజ్సర్కిల్ వేదికగా కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన 2500 వాహనాలను సీఎం జగన్మోహనరెడ్డి ప్రారంభించనున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 9260 వాహనాలను రూ.539 కోట్లతో కొనుగోలు చేశామని అన్నారు.