జడ్పీ సమావేశాలపై కొవిడ్-19 ఎఫెక్ట్
ABN , First Publish Date - 2020-08-13T10:24:20+05:30 IST
జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంపై మరోసారి కరోనా ఎఫెక్ట్ పడింది. జడ్పీ సమావేశమందిరంలో బుధవారం
కోరం లేక వరుసగా రెండో సారి సమావేశం వాయిదా
ఇద్దరు జడ్పీటీసీలు, ఆరుగురు జడ్పీ ఉద్యోగులకు కరోనా
కరీంనగర్, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతిప్రతినిధి): జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంపై మరోసారి కరోనా ఎఫెక్ట్ పడింది. జడ్పీ సమావేశమందిరంలో బుధవారం ఉదయం 11గంటలకు జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీలలో ఒక్కరు కూడా హాజరుకాకపోవడంతో వరుసగా రెండోసారి వాయిదా పడింది. ఈ సమావేశానికి జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, డీసీఎంఎస్ సభ్యుడు డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి ఎక్స్ ఆఫీషియో సభ్యుడిగా ఒక్కరు మాత్రమే హాజరయ్యారు. దీనితో అరగంట సేపు నిరీక్షించిన జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ సభ్యులు హాజరుకానందున కోరం లేక సమావేశాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించారు. తిరిగి సమావేశాన్ని నిర్వహించే తేదీని ప్రకటిస్తామని తెలిపారు. అయితే ఇటీవల ఇద్దరు జడ్పీటీసీలతో పాటు ఆరుగురు జడ్పీ సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో సమావేశానికి సభ్యులెవరు కూడా హాజరుకాలేదని తెలిసింది. జిల్లా అభివృద్ధికి బాటలు వేయడంతోపాటు సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేందుకు, ప్రజాసమస్యలను పరిష్కరించేం దుకు వేదికైన జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కనీసం ఆన్లైన్(జూమ్) సమావేశాలైన నిర్వహించి ప్రజలకు మేలు చేయాలని కోరుతున్నారు.