గోతులు పూడ్చితేనే.. టోల్ చెల్లిస్తాం..
ABN , First Publish Date - 2020-07-17T11:28:07+05:30 IST
కొవ్వూరు గామన్ బ్రిడ్జి రహదారికి మరమ్మతులు చేసే వరకూ టోల్ ఫీజు చెల్లించేది లేదని గురువారం పలువురు ఆందోళన దిగారు.
గామన్ బ్రిడ్జిపై ఆందోళన - ఫీజు వసూలు అడ్డగింత
కొవ్వూరు, జూలై 16 : కొవ్వూరు గామన్ బ్రిడ్జి రహదారికి మరమ్మతులు చేసే వరకూ టోల్ ఫీజు చెల్లించేది లేదని గురువారం పలువురు ఆందోళన దిగారు. టోల్ గేట్ వద్ద ఫీజు వసూలు చేయకుండా నిర్వాహకులను రాజమ హేంద్రవరం, కొవ్వూరుకు చెందిన యువకులు అడ్డుకున్నారు. వంతెనపై రహదారికి పెద్ద పెద్ద గోతులు పడి ప్రమాదాలకు నిలయంగా మారిందన్నారు.గత కొన్ని నెలలుగా పలు రాజకీయ పార్టీలు, ప్రజలు ఆందోళన చేస్తున్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు.
రహదారికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసే వరకు టోల్ఫీజు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం వరకు ఫీజులు వసూలు చేయకుండా అడ్డుకున్నారు. నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడంతో పట్టణ సీఐ ఎంవీవీఎస్ఎన్ మూర్తి, ఎస్ఐ వెంకట రమణ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించినప్పటికీ మరమ్మతులు పూర్తయ్యే వరకు టోల్ఫీజు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ కూర్చుండిపోయారు.