మా భూములు తీసుకోవద్దు : దళితులు
ABN , First Publish Date - 2020-05-27T08:42:22+05:30 IST
మూడు దశాబ్దాలుగా సొసైటీ భూములపైనే ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్నామని, ఆ భూములు తీసుకుని మా కడుపులు ..
మోపిదేవి: మూడు దశాబ్దాలుగా సొసైటీ భూములపైనే ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్నామని, ఆ భూములు తీసుకుని మా కడుపులు కొట్టవద్దంటూ కె.కొత్తపాలెం దళితులు అధికారులను అడ్డుకున్నారు. బొబ్బర్లంక రెవెన్యూ పరిధిలోని దళితులు అనుభవిస్తున్న సొసైటీ భూములను నివేశనాస్థలాలుగా ఇవ్వడానికి కొలతలు తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు మంగళవారం గ్రామానికి చేరుకున్నారు.
కృష్ణానది గర్భంలో భూములు ఉన్నాయని, నివేశనాస్థలాలకు కేటాయించటానికి ఏ మాత్రం అనువుగా ఉండవని, వేరే భూములు ప్రతిపాదించాల్సిందిగా సాగు చేసుకుంటున్న 35 మంది రైతులు కోరారు. ప్రభుత్వం నిర్ణయానికి సహకరించాలని తహసీల్దార్ సుబ్రహ్మణ్యశర్మ, ఎస్సై సురేష్ గ్రామస్థులను కోరారు. జీవనాధారమైన భూములను తీసుకుంటే ఆత్మహత్యలే శరణ్యమని దళితులన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటామని, అధికారులు తాత్కాలికంగా కొలతలు నిలిపివేశారు.