విజయం మనదే కావాలి : కేటీఆర్
ABN , First Publish Date - 2021-01-17T06:17:57+05:30 IST
ఎమ్మెల్సీ, సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లో శనివారం సాయంత్రం ఏడు గంటలకు సమీక్ష ప్రారంభం కాగా, రాత్రి 9 గంటల వరకు కొనసాగింది.
సాగర్ అభ్యర్ధి ప్రకటనకు మరింత సమయం
ఎమ్మెల్సీ, సాగర్ ఎన్నికలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశా నిర్దేశం
నల్లగొండ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎమ్మెల్సీ, సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లో శనివారం సాయంత్రం ఏడు గంటలకు సమీక్ష ప్రారంభం కాగా, రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 50 మంది ఓటర్లకు ఒకరు బాధ్యత తీసుకొని పనిచేసేలా కార్యాచరణ ఉండాలని, ఓటర్లను బూత్ వరకు తీసుకొచ్చి ఓటింగ్ చేయించే బాధ్యతను సీరియ్సగా తీసుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించారు. స్థానికంగా తాజా రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో నియోజకవర్గాలకు సంబంధించి వివిధ సర్వే నివేదికల సమాచారాన్ని ఎమ్మెల్యేలతో పంచుకున్నారు. మండలి ఎన్నికలకు సంబంధించి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రంగంలోకి దిగాలని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరిలో మొదటి వారంలో వచ్చే అవకాశం ఉందని, మార్చి రెండో వారంలో మండలి ఎన్నికలు, మార్చి చివరలో సాగర్ ఉప ఎన్నికకు అవకాశం ఉంటుందని చెప్పినట్టు తెలిసింది. సోషల్ మీడియాను విస్తృతంగా వాడాలని, అందుకు పార్టీ సోషల్ మీడియా ఆర్మీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సాగర్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని అంతా కలిసి పనిచేయాలని, అభ్యర్థి ఎవరనేది సరైన సమయంలో స్పష్టం చేస్తామని, గ్రూపు రాజకీయాలకు తావులేకుండా అంతా ఏకతాటిపై నిలిచి, నేతలు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాలని మంత్రి కేటీఆర్ సూచించినట్టు సమాచారం.