భూతగాదాలతో ఘర్షణ.. మహిళపై కత్తితో దాడి

ABN , First Publish Date - 2020-08-11T15:00:19+05:30 IST

భూతగాదాలతో ఇరువర్గాల నడుమ జరిగిన ఘర్షణలో ఓ మహిళ తీవ్ర గాయాలపాలైన..

భూతగాదాలతో ఘర్షణ.. మహిళపై కత్తితో దాడి

కేవీపల్లె(చిత్తూరు): భూతగాదాలతో ఇరువర్గాల నడుమ జరిగిన ఘర్షణలో ఓ మహిళ తీవ్ర గాయాలపాలైన సంఘటన కేవీపల్లె మండలంలో జరిగింది. బాధితురాలు ఎం.తులసి కథనం మేరకు.. మారెళ్ల పంచాయతీ పాపిరెడ్డిగారిపల్లెకు చెందిన ఎం. తులసికి, పెదనాన్న కంభం కృష్ణారెడ్డికి నడుమ కొంతకాలంగా భూతగాదాలున్నాయి. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు నిర్వహించినా ఫలితం లేకపోవడంతో తులసి పీలేరు కోర్టును ఆశ్రయించింది.  భాగ పరిష్కారమయ్యే వరకూ ఆ భూమిలో ఎవరూ ప్రవేశించరాదని కోర్టు ఆదేశించింది.


ఈ నేపథ్యంలో సోమవారం కృష్ణారెడ్డి బావమరుదులైన బి.వెంకట్రమణారెడ్డి, ఆనంద రెడ్డి ట్రాక్టర్‌తో ఆ పొలం దున్నేందుకు ఉపక్రమించారు. అడ్డుకున్న తులసిపై కత్తితో బంధువులైన స్వరూప, శ్రీనివాసులురెడ్డిలతో కలసి దాడిచేశారు. తలకు తీవ్ర గాయమైన తులసిని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా వివాదంలో వున్న భూమిలో కాకుండా తన పొలంలో తన బావమరుదులైన వెంకట్రమణారెడ్డి, ఆనందరెడ్డి ట్రాక్టరుతో పొలం దున్నుతుండగా తులసి అడ్డుకుందని కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందస్తుగా వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ పోసి ట్రాక్టర్‌కు నిప్పంటించిందన్నారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామ్మోహన్‌ తెలిపారు. 


Updated Date - 2020-08-11T15:00:19+05:30 IST