యజమానిని చంపిన డ్రైవర్కు జీవితఖైదు
ABN , First Publish Date - 2021-06-10T13:36:41+05:30 IST
హోటల్ గదిలో యజమానిని కిరాతకంగా చంపి సొత్తు అపహరించిన డ్రైవర్కు న్యాయమూర్తి జీవితఖైదు..
హైదరాబాద్ సిటీ/ఖైరతాబాద్ : హోటల్ గదిలో యజమానిని కిరాతకంగా చంపి సొత్తు అపహరించిన డ్రైవర్కు న్యాయమూర్తి జీవితఖైదు విధించారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాంప్షైర్ ప్లాజాలో 2013లో ఈ హత్య జరిగిదిఇ. ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వల్యాపారి శివప్రసాద్(56) పనుల్లో భాగంగా 2013 ఆగస్టు నెల మూడో వారంలో తన డ్రైవర్ ప్రశాంత్, గన్మెన్ శ్రీనివాస్రావులతో కలిసి లక్డీకాపూల్లోని హాంప్షైర్ ప్లాజా హోటల్లో దిగారు. 17న హోటల్ గదిలో శివప్రసాద్ డ్రైవర్ ప్రశాంత్తో కలిసి ఒక గదిలో, గన్మెన్ శ్రీనివాసరావు మరో గదిలో నిద్రకు ఉపక్రమించారు.
అదే రాత్రి ప్రశాంత్ తన యజమానిని గదిలో ఉన్న బరువు తూగే యంత్రంతో తలపై బాది కిరాతకంగా హత్య చేయడంతోపాటు అతడి బంగారు ఉంగరం, గొలుసు, ఏటీఎం కార్డుతోపాటు కారును దొంగిలించి పారిపోయాడు. ఈ కేసులో పోలీసులు సాక్ష్యులను విచారించి నిందితుడిపై అభియోగాలు నమోదు చేసి నాంపల్లి మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జికి సమర్పించారు. సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు బుధవారం నిందితుడు ప్రశాంత్కు జీవిత ఖైదుతో పాటు 5వేలు రూపాయల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో శిక్షను మరో 5నెలలు పొడిగించాల్సిన ఉంటుందని కోర్టు తెలిపింది.