లాక్‘డౌన్’
ABN , First Publish Date - 2020-04-09T10:48:24+05:30 IST
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు బుధవారం ఒక్కరోజే 7 నమోదయ్యాయి.
జిల్లాలో పటిష్టంగా అమలు కాని లాక్డౌన్..
చలానాలతోనే సరిపెడుతున్న పోలీసులు
అనంతపురం,ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు బుధవారం ఒక్కరోజే 7 నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 13కు పెరిగింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిలువరించాలంటే నిర్బంధమే మార్గం. అందుకే ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. దీని ప్రకారం ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి ఇళ్లకే పరిమితం కావాలి. అత్యవ సరంగా బయటకు వస్తే భౌతికదూరాన్ని పాటించాలి. కానీ జిల్లా ప్రజలు చాలా చోట్ల లాక్డౌన్కు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు.
విచ్చలవిడిగా బైక్లు వేసుకుని రోడ్లపై షికార్లు కొడుతున్నారు. బుధవారం హిందూపురం, లేపాక్షిలో మినహా అన్ని ప్రాంతాల్లోనూ జనసంచారం బాగా కనిపించింది. లాక్డౌన్ సమర్థవంతంగా అమలు చేయాల్సిన పోలీస్ యంత్రాంగం చలనాలతోనే సరిపెడుతోంది.లాక్ డౌన్ అమలు నాటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు చలానాల రూపంలో రూ. కోటికి పైగా వసూలు చేశారంటే వాహనదారులు నిత్యం రోడ్లపైకి ఎంత విచ్చలవిడిగా వస్తున్నారో అర్థమవుతుంది. దీన్నిబట్టి చూస్తే జిల్లాలో లాక్డౌన్ సమర్థవంతంగా అమలు కావడం లేదన్నది సుస్పష్టం. జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు మాత్రం తెల్లవారుజాము నుంచే విధుల్లోకి దిగుతున్నారు. బుధవారం ఒక్కరోజే కొడికొండ చెక్పోస్టు, తాడిపత్రి సరిహద్దు, గుత్తి, గుంతకల్లు తదితర ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు.
ఆయా సరిహద్దుల నుంచి ఇతర జిల్లాల ప్రజలు జిల్లాలోకి రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే పట్టణాల్లో స్థానిక పోలీస్ అధికారులు ఆ మేరకు ప్రజలను నియంత్రించడంలో ప్రత్యేక చొరవ చూపడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సేవల ము సుగులో కొందరు విచ్చలవిడిగా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. దీంతో కరోనా వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సేవల విషయంలో నూ జాగ్రత్తలు తీసుకునేలా సంబంధికులకు పోలీసులు స్పష్టమైన ఆదేశాలు ఇ వ్వాల్సి ఉంది.
రాజకీయ నాయకులు సైతం ఎక్కడా భౌతిక దూరాన్ని పాటించడం లేదు. ఈ క్రమంలో జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెంద కుండా నిరోధించాలంటే ప్రజాప్రతినిధుల జోక్యం అవసరం. పోలీసులు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధి కారులు ఆ మేరకు సమష్టిగా ఆలోచనలు చేసి ఆ దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.