జోరుగా కరోనా వ్యాక్సినేషన్
ABN , First Publish Date - 2021-07-30T05:53:16+05:30 IST
జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ప్రతి రోజూ 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లలో రోజుకు 150 చొప్పున టీకాలు ఇస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి,సూర్యాపేట)
జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ప్రతి రోజూ 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లలో రోజుకు 150 చొప్పున టీకాలు ఇస్తున్నారు. సూర్యాపేట జనరల్ ఆస్పత్రి, హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రి, కమ్యూనిటీ హెల్త్ సెం టర్లు తుంగతుర్తి, నడిగూడెం, కోదాడలలో ప్రతి రోజు 300 మందికి టీకా వేస్తున్నారు. జిల్లాలో ప్రతిరోజూ సగటున 5850 మందికి వ్యాక్సినేషన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. మరో మూడు నెలల్లో మొదటివిడత వ్యాక్సినేషన్ పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఆటంకం లేకుండా ప్రభుత్వం టీకాలను సరఫరా చేస్తోంది. ఈనెల 21 తేదీన మాత్రమే టీకాలు లేక వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆగింది.
నేటి వరకు 2,75,243 మందికి డోస్లు
జిల్లాలో నేటి వరకు కోవిషీల్డ్, కోవ్యాగ్జిన్ టీకాలు 2,13,042 మందికి మొదటిడోస్ వేశారు. రెండవ డోస్ 64,201 మంది తీసుకున్నారు. ప్రభుత్వం మొదటగా ఫ్రంట్లైన్ వారియర్స్ అయిన ఆరోగ్య, ఐసీడీఎస్ సిబ్బందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఆ తర్వాత వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ చేశారు.
18 ఏళ్లు పైబడిన వారు టీకా వేసుకోవాలి
జిల్లాలో మరో మూడు నెలల్లో మొదటి విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. 18 ఏళ్లు పైబడిన వారు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే టీకా వేస్తాం. వ్యాక్సిన్ తీసుకున్నా అజాగ్రత్తగా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి. చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలి.
-పెండెం వెంకటరమణ, వ్యాక్సినేషన్ జిల్లా అధికారి