వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
ABN , First Publish Date - 2021-04-01T02:06:28+05:30 IST
పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయని
న్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందుతున్నవారికి కాస్త ఊరటనిచ్చే వార్త ఇది. వంట గ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్ ధర ఏప్రిల్ 1 నుంచి రూ.10 తగ్గబోతోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ విషయాన్ని బుధవారం ధ్రువీకరించినట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది.
ఈ ఏడాదిలో వంట గ్యాస్ ధర దాదాపు మూడుసార్లు పెరిగింది. ప్రస్తుతం ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.819, కోల్కతాలో రూ.845, ముంబైలో రూ.819, చెన్నైలో రూ.835గా ఉంది.
ఇదిలావుండగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం, అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుతుండటంతో వంట గ్యాస్ ధరలు సమీప భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. పెట్రోలు, డీజిల్ ధరలు ఓ వారంలో మూడుసార్లు తగ్గిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో శాసన సభ ఎన్నికలు జరుగుతుండటంతో పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు ప్రచారాస్త్రంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ధరలను కట్టడి చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విమర్శలపై అధికార పక్షం స్పందిస్తూ, ఈ ధరలు అంతర్జాతీయ మార్కెట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులపై ఆధారపడతాయని చెప్తోంది.