మమ్మల్ని రెగ్యులర్ చేయండి
ABN , First Publish Date - 2021-06-25T06:25:16+05:30 IST
ప్రాణాలకు తెగించి కొవిడ్ విధులు నిర్వహిస్తున్న తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగులు గురువారం కర్నూలు డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
- కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగుల వినూత్న నిరసన
కర్నూలు(హాస్పిటల్), జూన్ 24: ప్రాణాలకు తెగించి కొవిడ్ విధులు నిర్వహిస్తున్న తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగులు గురువారం కర్నూలు డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కాంట్రాక్టు మహిళా పారామెడికల్ ఉద్యోగులు కొంగుపట్టి అడిగారు. ఈ నిరసనకు కర్నూలు జిల్లాలోని వివిధ వైద్య ఉద్యోగుల సంఘాలు సంఘీభావం తెలిపాయి. కర్నూలు జిల్లా కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగుల సంఘం జేఏసీ జిల్లా కన్వీనర్ పి.ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా కాంట్రాక్టు వ్యవస్థలోనే మగ్గిపోతున్నా పాలకులు రెగ్యులర్ చేయకపోవడం తీవ్ర అన్యాయమన్నారు. ఎన్నికల సమయంలో అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని మేనిఫెస్టోలో పెట్టారని, ఇంతవరకు తమను పట్టించుకోవడం లేదని అన్నారు. అనంతరం కర్నూలు డీఎంహెచ్వో డా.బి.రామగిడ్డయ్యకు జేఏసీ నేతలు వినతి పత్రం సమర్పించారు.