రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-01-17T05:38:48+05:30 IST
అనారోగ్యం, మానసిక ఆందోళనతో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
భువనగిరి రూరల్, జనవరి 16: అనారోగ్యం, మానసిక ఆందోళనతో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన భువనగిరి శివారులోని అనంతారం రైల్వే బ్రిడ్జి కింద శుక్రవారం రాత్రి జరిగింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం రంకెల్ గ్రామానికి చెందిన కుమ్మరి జ్ఞానేశ్వర్(27) కొన్ని రోజులనుంచి అనారోగ్యంతో బాధపడుతూ మానసిక వేదనతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతుడి సెల్ఫోన్ ఆధారంగా ఆచూకీ తెలుసుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. మృతుని తండ్రి పాపయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు రైల్వే ఎస్ఐ ఎస్కే సైదులు తెలిపారు.
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
వలిగొండ, జనవరి 16: మండలంలోని వెంకటాపురంలో మతిస్థిమితంలేని వ్యక్తి అదృశ్యమయ్యాడు. అడ్డగూడూరు మండలం డి.రేపాక గ్రామానికి చెందిన ముక్కాముల లక్ష్మి తన భర్త నర్సయ్య(40)తో కలిసి నాలుగేళ్ల క్రితం వలిగొండ మండలం వెంకటాపురానికి వచ్చా రు. కూలీ పనిచేస్తూ జీవిస్తున్నారు. కాగా నర్సయ్య కొంతకాలంగా మానసికవ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నేపధ్యంలో ఈనెల13న అర్ధరాత్రి కుటుంబసభ్యులు నిద్రిస్తుండగా ఇంటినుంచి అదృశ్యమయ్యాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాఘవేందర్గౌడ్ తెలిపారు.
వేర్వేరు కారణాలతో ఇద్దరి ఆత్మహత్యాయత్నం
మోత్కూరు, జనవరి 16: మోత్కూరు మండలంలో వేర్వేరు కారణాలతో ఇద్దరు ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. కుటుంబ కలహాలతో కొండగడపకు చెందిన పెద్దబోయిన యాదయ్య వ్యవసాయ బావి వద్ద పురుగులు మందు తాగాడు. పాటిమట్ల గ్రామానికి చెందిన రాచకొండ యాదయ్య మద్యానికి బానిసై, మద్యం అనుకొని పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం ఇద్దరిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు 108 సిబ్బంది తెలిపారు.
ఒంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని..
యాదాద్రి రూరల్, జనవరి 16: యాదగిరిగుట్ట మునిసిపాలిటీలో పనిచేసే ఉద్యోగి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానిక ఎస్ఐ. రాజు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో కమాటిగా పనిచేసే గ్యాదపాక వెంకటేష్ శనివారం ఒంటిపై కిరోసిన్ పోకుని నిప్పంటించుకున్నాడు. శరీరం సుమారం 60శాతం శరీరం కాలిపోవడంతో హైదరాబాద్కు తరలించారు. వెంకటేష్ భార్య ఫిర్యాదుమేరకు కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ తెలిపారు.
తాటిచెట్టుపైనుంచి పడి తీవ్ర గాయాలు
ఆలేరు రూరల్, జనవరి 16: తాటిచెట్టుపై నుంచి పడి గీతకార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని గుండ్లగూడెం గ్రామానికి చెందిన భీమగాని బాలరాజు శనివారం తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారిపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్సకోసం ఆలేరులోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు.
రోడ్డుప్రమాదంలో..
వలిగొండ: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. సికింద్రాబాద్కు చెందిన సున్నాల రామచంద్రు(50) ద్విచక్ర వాహనంపై మండలకేంద్రం వైపునకు వస్తుండగా అదుపు తప్పి ప్రమాదవశాత్తు రోడ్డుపై కిందపడగా, స్వల్ప గాయాలయ్యాయి. 108 సిబ్బంది భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
దురుసుగా ప్రవర్తించిన ఇద్దరికి రిమాండ్
వలిగొండ, జనవరి 16: సంక్రాంతి పండుగ రోజున పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వలిగొండ మండల కేంద్రానికి చెందిన కళ్లెం శ్రీను, కళ్లెం నరేష్ అన్నదమ్ములు. సంక్రాంతి నాడు విధులు నిర్వహిస్తున్న పోలీసులకు అడ్డుతగిలి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంతో పాటు స్థానికుల పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు కేసు నమో దు చేశారు. శనివారం రామన్నపేట కోర్టులో హాజరుపరిచి వారిని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ రాఘవేందర్గౌడ్ తెలిపారు.