మన్యంకొండను మరో తిరుపతిగా మారుస్తా

ABN , First Publish Date - 2022-02-17T05:07:27+05:30 IST

మహబూబ్‌నగర్‌ జిల్లా మన్యకొండలో వెలసిన మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వర దేవాలయాన్ని మరో తిరుపతిగా మారుస్తానని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.

మన్యంకొండను మరో తిరుపతిగా మారుస్తా
దాసంగాలను సమర్పిస్తున్న భక్తులు

- మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

- ఆలయంలో ప్రత్యేక పూజలు 


మహబూబ్‌నగర్‌ రూరల్‌, ఫిబ్రవరి 16: మహబూబ్‌నగర్‌ జిల్లా మన్యకొండలో వెలసిన మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వర దేవాలయాన్ని మరో తిరుపతిగా మారుస్తానని మంత్రి  శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. బుధవారం ఆలయ బ్రహ్మోత్సవాలకు వెళ్లిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకట్రావులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. అనంతరం స్నానాలకు ఏర్పాటుచేసిన నల్లాను పరిశీలించి, భక్తులకు కల్పించిన సౌకర్యాల వివరాలపై మంత్రి ఆరా తీశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, జడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, ఎస్పీ వెంకటేశ్వర్లు, ఆలయ ధర్మకర్త మధుసూదన్‌కుమార్‌, ఎంపీపీ సుధశ్రీ, వైస్‌ ఎంపీపీ అనిత తదితరులున్నారు. 

గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు 

బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ఆలయ ధర్మకర్త ఆళహరి మధుసూదన్‌కుమార్‌ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గరుడ వాహన సేవపై ఊరేగించారు. భక్తులు మట్టికుండలో పచ్చిపులుసుతో తయారుచేసిన దాసంగాలను స్వామి వారికి సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. 

Updated Date - 2022-02-17T05:07:27+05:30 IST