మత్స్యకారులతో మేయర్‌ ఉగాది సంబరాలు

ABN , First Publish Date - 2021-04-14T06:41:29+05:30 IST

ఉగాది పండుగను జీవీఎంసీ మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి మంగళవారం మంగమారిపేట మత్స్యకారులతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు.

మత్స్యకారులతో మేయర్‌ ఉగాది సంబరాలు
మత్స్యకార మహిళకు ఉగాది పచ్చడి తినిపిస్తున్న మేయర్‌

హరి వెంకటకుమారి రాకతో సంభ్రమాశ్చర్యాలకు లోనైన మంగమారిపేట గ్రామస్థులు 

భీమునిపట్నం, ఏప్రిల్‌ 13: ఉగాది పండుగను జీవీఎంసీ మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి మంగళవారం మంగమారిపేట మత్స్యకారులతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. అనుకోని అతిథిలా తమ ఇళ్లకు విచ్చేసిన మేయర్‌ను చూసి మత్స్యకారులు సంభ్రమా శ్చర్యాలకు లోనయ్యారు. హరి వెంకటకుమారికి మత్స్యకార మహిళలు ఆనందోత్సాహంగా స్వాగతం పలికారు. మీ అందరి మధ్య ఉగాది వేడుకలను జరుపుకునేందుకు వచ్చామని మేయర్‌ దంపతులు చెప్పడంతో పాటు అందరికీ నమస్కారాలు చేస్తూ సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా మేయర్‌ స్వయంగా తయారుచేసి తెచ్చిన ఉగాది పచ్చడిని అందరికీ అందించి, ఎలా ఉందని అడిగారు. పలువురు మహిళలు తమ ఇళ్లకు రమ్మని కోరడంతో వారిళ్లకు వెళ్లి వారు పెట్టిన ఉగాది పచ్చడిని మేయర్‌ దంపతులు ఆరగించారు. అలాగే చిన్నారులకు మేయర్‌ ఉగాది పచ్చడి తినిపించి.. ఏమి చదువుతున్నారు, ఎలా చదువుతున్నావు, ఏ స్కూళ్లలో చదువుతున్నారంటూ కుశల ప్రశ్నలు వేసి సరదాగా ముచ్చటించారు. జీవీఎంసీ నాలుగో వార్డు పరిధిలో మంగమారిపేట ఉండడంతో కార్పొరేటర్‌ దౌలపల్లి ఏడుకొండలరావును అక్కడి సమస్యలను మేయర్‌ అడిగి తెలుసుకున్నారు. మరోసారి అధికారులతో కలిసి ఇక్కడకు వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం హరి వెంకటకుమారి మాట్లాడుతూ మొదటినుంచి తన భర్త గొలగాని శ్రీనివాసరావుతో కలిసి పండుగలను దగ్గరలో ఉన్న జనంతో జరుపుకోవడం అలవాటుగా వస్తోందని, అందరితో కలిసి మెలిసి మమేకమవ్వడమే అసలైన సంతోషమని, ఆ ఆనందమే వేరని పేర్కొన్నారు. 



Updated Date - 2021-04-14T06:41:29+05:30 IST