ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం
ABN , First Publish Date - 2020-10-22T05:49:30+05:30 IST
ప్రజా ఆస్తుల రక్షణ, సంఘ విద్రోహ కార్యకలాపాలను అరికట్టే క్రమంలో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాలు మరువలేనివని రామగుండం సీపీ సత్యనారాయణ అన్నారు
మందమర్రిలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సీపీ సత్యనారాయణ
జిల్లాలోని ఆయా మండలాల్లో బుధవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల పోలీస్ సిబ్బంది రక్తదాన శిబిరాలు నిర్వహించారు.
మందమర్రిటౌన్, అక్టోబరు 21: ప్రజా ఆస్తుల రక్షణ, సంఘ విద్రోహ కార్యకలాపాలను అరికట్టే క్రమంలో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాలు మరువలేనివని రామగుండం సీపీ సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని సీఈఆర్ క్లబ్లో పోలీసు అమరుల సంస్మరణ వేడుకల సందర్భంగా మందమర్రి సీఐ మహేష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. మందమర్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం గర్వంగా ఉందని కొనియాడారు. ఈ శిబిరానికి 350 మందికి పైగా హాజరై రక్తదానం చేయ డం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి, బెల్లంపల్లి ఏసీపీ రహెమాన్, మందమర్రి సీఐ మహేష్, ఎస్సై భూమే ష్, కాసిపేట, దేవాపూర్, రామకృష్ణపూర్ ఎస్సైలు, పోలీసులు పాల్గొన్నారు. పట్టణంలోని సీఈఆర్ క్లబ్లో మందమర్రి సీఐ మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో 60 మంది సింగరేణి ఎస్అండ్పీసీ సిబ్బంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్అండ్పీసీ సిబ్బందిని సీఐ మహేష్ సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఎస్అండ్పీసీ సెక్యూరిటీ ఆఫీసర్ రవి కూడా రక్తదానం చేసిన సిబ్బందిని అభినందించారు.
శ్రీరాంపూర్: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఫ్లాగ్ డే సందర్బంగా శ్రీరాంపూర్లో ఎస్సై మంగీలాల్ ఆద్వర్యంలో శ్రీరాంపూర్ బస్టాండ్ నుంచి ఆర్కే 6 గుడిసెలు కొత్తరోడ్ వరకు ఏర్పాటు చేసిన 2కే రన్ను జైపూర్ ఏసీపీ నరేందర్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఇసంపెల్లి ప్రభాకర్, సీఐ బిల్లా కోటేశ్వర్ ప్రారంభించారు. అనంతరం జరిగిన సంస్మరణ సభలో పోలీస్ అమర వీరుల ఆత్మ శాంతికి యువకులు, పోలీసులు, ప్రజా ప్రతినిదులు 2 నిమిషాలు మౌనం పాటించి, క్యాండిల్స్ వెలిగించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నడిపెల్లి దివాకర్రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కె సురేందర్రెడ్డి, పత్తి గట్టయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పత్తి వెంకటేష్, కౌన్సిలర్లు పూదరి కుమార్, మాజీ సర్పంచ్లు మల్లెత్తుల రాజేంద్రపాణి, ఏఎస్సై అంజయ్య, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు బండి తిరుపతి, పోలీసులు పాల్గొన్నారు.
హాజీపూర్: పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. మండలంలోని గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్లోని పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద బెటాలియన్ కమాండెంట్ ఎంఐ సురేష్తో కలిసి ఎమ్మెల్యే దివాకర్రావు పుష్పగుచ్ఛం ఉంచి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇంటర్, పదో తరగతి పరీక్షల్లో టాపర్లుగా నిలిచి వారితో పాటు పోలీసు సేవల్లో ఉన్నతంగా రాణించిన వారికి నగదు, ప్రసంశా పత్రాలు అందజేశారు. సంస్మరణ దినోత్సవ వేడుకల్లో ఎంపీపీ మందపల్లి స్వర్ణలత, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి, గుడిపేట సర్పంచ్ లగిశెట్టి లక్ష్మి, మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్ నాయకులు లగిశెట్టి రాజయ్య, బేర పోశం, బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ నాగా నాయక్, భిక్షపతి, రఘునాథ్ చౌహాన్, ఆర్ఐలు డా. సంతోష్ సింగ్, శ్రీధర్ బాబు, బెటాలియన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మండలంలో పోలీసుల ఆధ్వర్యంలో కొలాంగూడ గ్రామ ప్రజలకు దుస్తులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా సీఐ కుమారస్వామి, ఎస్సై చంద్రశేఖర్ హాజరయ్యారు. కార్యక్రమంలో పెద్దంపేట్ సర్పంచ్ శ్రీశైలం గౌడ్, ఎంపీటీసీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి: విధి నిర్వహణలో ఎంతో మంది అమరులయ్యారని, వారి సేవలు మరువ లేనివని డీసీపీ ఉదయ్కుమార్ రెడ్డి అన్నారు. బెల్లంపల్లి హెడ్ క్వార్టర్స్లో పోలీస్ అమరువీరుల వారోత్సవాల్లో భాగంగా అమర పోలీసులకు డీసీపీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఈ నెల 31 వరకు వారోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రహెమాన్, సీఐలు రాజు, జగదీష్, బాబురావు, ఎస్ఐలు సమ్మయ్య, భాస్కర్, రాజేంద్ర ప్రసాద్, పోలీసులు పాల్గొన్నారు.
తాండూర్(బెల్లంపల్లి): తాండూర్ సీఐ బాబురావు ఆధ్వర్యంలో తాండూర్ ఐబీ కేంద్రంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఎస్ఐలు శేఖర్రెడ్డి, మానస, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి టౌన్: ప్రజలను కాపాడేందుకు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలర్పించి చిరస్మరణీయులుగా నిలిచారని డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి తెలిపారు. పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో పోలీసు అమర వీరుల వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ ఎంఎ రహమాన్, బెల్లంపల్లి ఏఆర్ఆర్ఐ అనిల్కుమార్, బెల్లంపల్లి పట్టణ, రూరల్ ఇన్స్పెక్టర్లు రాజు, జగదీష్, బెల్లంపల్లి 1వ, 2వ, తాళ్లగురిజాల ఎస్సైలు, ఏఆర్ ఎస్సైలు, పెద్ద సంఖ్యలో ఏఆర్ పోలీసులు పాల్గొన్నారు.
జైపూర్: పోలీస్ అమర వీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో 2కే రన్ను జైపూర్ ఏసీపీ నరేందర్ ప్రారంభించారు. కార్యక్రమంలో శ్రీరాంపూర్ సీఐ బిల్లా కోటేశ్వర్, జైపూర్ ఎస్సై రామకృష్ణ, గంగరాజంగౌడ్, జడ్పీటీసీ మేడి సునిత, ఎంపీపీ గోదరి రమాదేవి, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
భీమారం: మండల కేంద్రంలో పోలీసు అమరుల దినోత్సవాన్ని ఎస్సై గొర్ల సంజీవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రవి, మాచర్ల, సంపత్, కిరణ్కుమార్, యువకులు పాల్గొన్నారు.