merina తీరంలో ‘ప్రాణ రక్షణ దళం’

ABN , First Publish Date - 2021-10-21T14:29:54+05:30 IST

స్థానిక మెరీనా బీచ్‌లో ప్రమాదవశాత్తూ మునిగిపోయేవారిని కాపాడేందుకు ప్రత్యేకంగా ‘ప్రాణ రక్షణ దళం’ ఏర్పాటైంది. బుధవారం ఉదయం డీజీపీ శైలేంద్రబాబు, గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌జివాల్‌, సముద్రతీర భద్రతాదళం

merina తీరంలో ‘ప్రాణ రక్షణ దళం’

చెన్నై(tamilnadu): స్థానిక మెరీనా బీచ్‌లో ప్రమాదవశాత్తూ మునిగిపోయేవారిని కాపాడేందుకు ప్రత్యేకంగా ‘ప్రాణ రక్షణ దళం’ ఏర్పాటైంది. బుధవారం ఉదయం డీజీపీ శైలేంద్రబాబు, గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌జివాల్‌, సముద్రతీర భద్రతాదళం అదనపు పోలీసు సంచాలకుడు సందీప్‌ మిట్టల్‌ ఈ దళాన్ని లాంఛనంగా ప్రారంభించారు. నగరంలో ప్రతిరోజూ మెరీనా బీచ్‌, ఎన్నూరు, బీసెంట్‌నగర్‌, తిరువాన్మియూరు, పాలవాక్కం సముద్రతీరాలను సందర్శించేందుకు వేల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ఆ సమయంలో సముద్రంలో ఆటలాడుతూ, స్నానం చేస్తూ ప్రమాదవశాత్తూ పలువురు నీటి మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతియేటా ఈ విధంగా సుమారు వందమంది దాకా సముద్రంలో మునిగి మృతిచెందుతున్నట్టు పోలీసుశాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగర పరిధిలో సముద్రతీర ప్రాంతాల్లో నీట మునిగేవారిని సకాలంలో కాపాడేందుకు ప్రత్యేక ప్రాణరక్షణదళం ఏర్పాటు చేస్తామని ఇటీవల ముగిసిన శాసనసభ సమావేశాల్లో హోంశాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. ఆ మేరకు బుధవారం ఉదయం డీజీపీ శైలేంద్రబాబు సమక్షంలో ఈ కొత్త దళాన్ని ప్రారంభించారు. ఈ దళంలో పోలీసుశాఖ, అగ్నిమాపక శాఖ, సముద్రతీర రక్షణ శాఖ, జాలర్ల సంక్షేమ సంఘం, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, గజ ఈతగాళ్ళు, క్రీడాకారులు, ప్రాథమిక వైద్యచికిత్సా విభాగం వలంటీర్లు సభ్యులుగా ఉంటారు. ఈ దళం సభ్యులంతా వేగంగా నడిచే పడవులు, ప్రాణరక్షణ దుస్తులు, లైఫ్‌ బోట్లు, బైనాక్యులర్లు, దారాలు తదితర పరికరాలతో ఎల్ల వేళలా సిద్ధంగా ఉంటారు. వీరి వద్ద ప్రాథమిక చికిత్సలందించే మందులు, పరికరాలు కూడా ఉంటాయి. సముద్రతీర ప్రాంతాలు కలిగిన 13 పోలీసుస్టేషన్ల పరిధిలో అన్నా విశ్వవిద్యాలయం, మారిటైమ్‌ యూనివర్శిటీ సాంకేతిక నిపుణుల సహకారంతో సూచనలతో 14 చోట్ల నిఘా గోపురాలను కూడా ఏర్పాటు చేస్తారు.

Updated Date - 2021-10-21T14:29:54+05:30 IST