సీఎంతో మంత్రి బాలినేని భేటీ

ABN , First Publish Date - 2020-06-03T10:57:18+05:30 IST

జిల్లా లో ఇటు పాలనాపరంగా, అటు..

సీఎంతో మంత్రి బాలినేని భేటీ

జిల్లా వ్యవహారాలపై సమీక్ష

చీరాల వ్యవహారం, గ్రానైట్‌ అంశాల ప్రస్తావన?

పాలనాపరమైన విషయాలపైనా చర్చ


ఒంగోలు(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ఇటు పాలనాపరంగా, అటు రాజకీయంగా పలు పరిణామాలు చోటుచేసుకున్న దశలో సీఎం వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డితో జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. ఇది అటు అధికార, ఇటు విపక్ష నేతలతోపాటు, అధికార యంత్రాంగంలోనూ చర్చనీయాంశమైంది. మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో ఉన్న సీఎంను బాలినేని కలిశారు. ఆ సమయంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా అక్కడ ఉన్నారు. విజయసాయిరెడ్డి, బాలినేని మధ్య కూడా జిల్లాకు చెందిన ఒకట్రెండు వ్యవహారాలపై చర్చ నడిచినట్లు తెలుస్తోంది. అనంతరం సీఎంతో బాలినేని జిల్లాకు సంబంధించిన అంశాలపై ఏకాంతంగా మాట్లాడినట్లు సమాచారం. 


చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు విషయం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇటీవల వలంటీర్ల పోస్టుల ఎంపిక ఎమ్మెల్యే బలరాం సిఫార్సులకు అనుగుణంగా జరిగింది. చీరాల టౌన్‌ సీఐ బదిలీకి బలరాం సిఫార్సు చేయగా ఆపేందుకు ఆమంచి విశ్వప్రయత్నం చేశారు. దీంతో ఈ వ్యవహారం బాలినేనితోపాటు, విజయ సాయిరెడ్డి, ఆ తర్వాత ముఖ్యమంత్రి వద్దకు కూడా చేరినట్లు సమాచారం. చివరకు సోమవారం రాత్రి బలరాం సిఫార్సుకు అనుగుణంగా సీఐ నాగమల్లేశ్వర రావును బదిలీ చేశారు. అయితే, ఆయనకు కందుకూరులో పోస్టింగ్‌ ఇవ్వడం ద్వారా ఆమంచిని కూడా సంతృప్తిపరిచే ప్రయత్నం జరిగింది. 


ఆమంచిని పార్టీలో చేర్చుకునే సమయంలో విజయసాయిరెడ్డి ముఖ్య భూమిక పోషించగా, బలరాం వైసీపీలో చేరికలో బాలినేని కీలక పాత్ర పోషించారు. దీంతో నియోజకవర్గంలో నెలకొన్న తాజా పరిణామాలపై ఇటు బాలినేని, అటు విజయసాయిరెడ్డిలను కలిపి సీఎం జగన్‌ మాట్లాడి ఉండవచ్చని భావిస్తున్నారు. వైసీపీ శ్రేణుల్లోనూ, పార్టీలోని కొందరి సీనియర్‌ నేతల్లోనూ అదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఆ నియోజకవర్గంలో ప్రస్తుతానికి బలరాంనకు పాలనాపరమైన వ్యవహారాలపై పట్టు లభించేలా వ్యవహరించే అవకాశం కన్పిస్తోంది. అదే సమయంలో ఆమంచిని కూడా దూరం చేసుకోకూడదన్న భావనతో వైసీపీ అధిష్ఠానం ఉన్నట్లు సమా చారం. 


తదనంతరం సీఎంతో బాలినేని ఏకాంతంగా మాట్లాడిన సమయంలో జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారే విషయంలో చోటుచేసుకున్న పరిణామాలు, ప్రస్తుతం గ్రానైట్‌ రంగంలో ఉన్న కొందరు టీడీపీ నేతలపై గురి పెట్టడం తదితర అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. అలాగే, జిల్లాలోని ఒక ట్రెండు నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. పాలనాపరమైన వ్యవహారాలపై కూడా స్వల్ప సమీక్ష జరిగిందని, నవరత్నాల అమలు, వెలిగొండ టన్నెల్‌ నిర్మాణంలో ఎలాంటి లోపం జరిగినా క్షమించేది లేదని, ఆ విషయంలో యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని బాలినేనికి జగన్‌ సూచించినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-06-03T10:57:18+05:30 IST