కుప్పంలో తండ్రి, కొడుకులిద్దరినీ ప్రజలు తిరస్కరించారు: మంత్రి పెద్దిరెడ్డి
ABN , First Publish Date - 2021-11-17T19:45:58+05:30 IST
కుప్పంలో తండ్రి, కొడుకులిద్దరినీ ప్రజలు తిరస్కరించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
అమరావతి: కుప్పంలో తండ్రి, కొడుకులిద్దరినీ ప్రజలు తిరస్కరించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇక పార్టీ అధ్యక్ష పదవి నుండి చంద్రబాబు వైదొలిగితే మంచిదని హితవుపలికారు. చంద్రబాబు రాజకీయాల నుండి తప్పుకుంటే సంతోషిస్తామన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు చూశాక చంద్రబాబు ఇక కుప్పంలో పోటీ చేస్తాడని తాను అనుకోవడం లేదని అన్నారు. తనపై తన నియోజకవర్గంలో చంద్రబాబు పోటీ చేస్తే ఆహ్వానిస్తానని తెలిపారు. ఏ పోలింగ్ బూత్లో అయినా దొంగ ఓట్లు వేశారని టీడీపీ పోలింగ్ ఏజెంట్లు అడ్డుకున్నారా? అని ప్రశ్నించారు. ఇకపై తండ్రికొడుకులు తమను విమర్శిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాక ఓట్ల కోసం డబ్బులు పంచాల్సిన అవసరం తమకు లేదన్నారు. తమ పార్టీ అమలు చేసిన సంక్షేమ - అభివృద్ది కార్యక్రయాలే విజయానికి కారణమని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో వర్షాలే పడలేదని.. అందుకే రోడ్లు పాడవ లేదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. బుధవారం సీఎం జగన్ను మంత్రి పెద్దిరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కుప్పంలో విజయం సాధించినందుకు మంత్రి పెద్దిరెడ్డి, జిల్లా పార్టీ నేతలను సీఎం జగన్ అభినందించారు.