వంగపండు మృతికి ఎమ్మెల్యే ధర్మాన సంతాపం
ABN , First Publish Date - 2020-08-05T10:45:32+05:30 IST
ప్రముఖ విప్లవ కవి, ప్రజా వాగ్దేయకారుడు వంగపండు ప్రసాదరావు మృతిపై ఎమ్మెల్యే దర్మాన ప్రసాదరావు ఒక ప్రకటనలో..
గుజరాతీపేట: ప్రముఖ విప్లవ కవి, ప్రజా వాగ్దేయకారుడు వంగపండు ప్రసాదరావు మృతిపై ఎమ్మెల్యే దర్మాన ప్రసాదరావు ఒక ప్రకటనలో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వంగపండు మరణం చిత్ర పరిశ్రమ, సాహిత్య లోకానికే కాదు... పీడిత ప్రజానీకానికి, సమాజానికి తీరని లోటు అని అన్నారు. వంగపండు కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఫ వంగపండు మృతికి గురజాడ విద్యా సంస్థల చైర్మన్ స్వామినాయుడు సంతాపం తెలిపారు.
పొందూరు: ప్రముఖ జానపద కళాకారుడు, వాగ్గేయకారుడు వంగపండు ప్రసాద్ మృతి సాహితీలోకానికి తీరనిలోటు అని కళాకారుల మండల సంఘ ప్రతినిధులు అన్నారు. ఏమి పిల్లడో ఎల్దుమొస్తవా వంటి జానపదపాటలతో ఉర్రూ తలూగించారని గుర్తుచేసుకున్నారు. శ్రీకాకుళం యాసలో అద్భుతమైన సాహిత్యంతో జానపదాలను అందించారన్నారు. వంగపండు మృతిపై కళాకారులు బూరాడ శ్రీనివాస్, కె.శాంతారాం, పైడిపెద్దిగారి ప్రసాద్, వాండ్రంగి కొండలరావు, ఉయ్యూరు దుర్గాప్రసాద్, సుబ్రహ్మణ్యం, వి.మురళీమోహన్, జాక రామారావు, ఎం.జగన్నాథం, ఎం. రామచంద్రరావు, వి.గోవిందరావు, బి. జనార్దరావు సంతాపం ప్రకటించారు.
ఆమదాలవలస రూరల్: వంగపండు ప్రసాదరావు మరణం శ్రామిక జనవాళికి తీరని లోటు అని ఆయన సహచరుడు బెండి మధుసూదనరావు అన్నారు. వంగపండు మృతి చెందిన నేపథ్యంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. శ్రీకాకుళంలో జరిగిన గిరిజనోద్యమంలో1972లో విశాఖ జైల్లో కలిసి ఉన్నామని అన్నారు. జైల్లో కూడా ఎన్నో కళారూపాలను ఆయన ప్రదర్శించాలని గుర్తు చేసుకున్నారు. సహచరులతో పాటు జైలు అధికారులు కూడా మెచ్చుకునే వారన్నారు. వంగపండు గేయరచనలు జన హృదయాలను గెలుచుకునేలా ఉంటాయని కొనియాడారు.