వరద ముంపు నష్టాన్ని రైల్వే శాఖ చెల్లించాలి
ABN , First Publish Date - 2020-10-25T11:08:31+05:30 IST
కొల్లేరు వరద ముంపు నష్టాన్ని రైల్వేశాఖ చెల్లించాలని కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు,ఉండి నియో జకవర్గ వైసీపీ ..
ఉప్పుటేరు (ఆకివీడురూరల్) అక్టోబరు 24 : కొల్లేరు వరద ముంపు నష్టాన్ని రైల్వేశాఖ చెల్లించాలని కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు,ఉండి నియో జకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పీవీఎల్ నరసింహరాజులు డిమాండ్ చేశారు. కృష్ణా- పశ్చిమ గోదారి జిల్లాల సరిహద్దులోని ఉప్పుటేరుపై నిర్మించిన రెండవ రైల్వే వంతెనను వారు పరిశీలించారు. రెండవ రైల్వే వంతెన పిల్లర్ల క్యాప్లు వెడల్పు ఎక్కువగా ఉందని వీటివల్ల నీటి ప్రవాహం తగ్గిపోయి కొల్లేరు తీర ప్రాంతాల గ్రామాలు ముంపుబారిన పడ్డాయన్నారు. వరద తగ్గగానే రెండు బ్రిడ్జిల మధ్య ఉన్న మట్టి, కిక్కిస తొలగించాలని డ్రెయినేజీ ఈఈ నాగార్జునరావును ఆదేశించారు. రెండవ రైల్వే వంతెన వల్ల రైతులు, ప్రజలు నష్టపోకుండా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఉండి ఎమ్మెల్యే రామరాజు డిమాండ్ చేశారు. వంతెనకు ఎగువ భాగంలో ఉన్న కిక్కిస, వంతెన నిర్మాణంలో ఉపయోగించిన మట్టిని తొలగించాలని కోరారు.