ఎమ్మెల్యే హామీని నిలబెట్టుకోవాలి
ABN , First Publish Date - 2021-01-21T05:43:09+05:30 IST
నంద్యాలకు మంజూరైన వైద్య కళాశాలకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూమి కాకుండా ఇతర చోట్ల కొనుగోలుకు కృషి చేస్తామంటూ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వ్యవసాయ కార్మికులు డిమాండ్ చేశారు.
- ఆర్ఏఆర్ఎస్ వ్యవసాయ కార్మికుల డిమాండ్
నంద్యాల, జనవరి 20: నంద్యాలకు మంజూరైన వైద్య కళాశాలకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూమి కాకుండా ఇతర చోట్ల కొనుగోలుకు కృషి చేస్తామంటూ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వ్యవసాయ కార్మికులు డిమాండ్ చేశారు. బుధవారం ఆర్ఏఆర్ఎస్ ఎదుట పట్టణ సీఐటీయూ అధ్యక్షుడు లక్ష్మణ్, కార్మికుల సంఘం నాయకులు ఖాదర్వలి, పుల్లయ్య, లీలావతి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రెండు నెలలకు పైగా ఆర్ఏఆర్ఎస్ భూమిని కాపాడుకునేందుకు ఆందోళనలను చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన సమయంలో ఆర్ఏఆర్ఎస్కు చెందిన పరిశోధనా భూమిని కాకుండా ఇతర భూములను కేటాయించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శిల్పా రవి బహిరంగంగా వెల్లడించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే హామీ నిలబెట్టుకోలేకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు ఏవీ రమణ, గోపాల్, ఎల్లమ్మ, అయ్యన్న, స్రవంతి, లీలావతి, నాగేశ్వరమ్మ, సుజాత, షకీనాబీతో పాటు భారీ సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.