ధరలను నియంత్రించడంలో మోదీ విఫలం
ABN , First Publish Date - 2021-11-30T04:49:07+05:30 IST
పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం మండిపడ్డారు.
సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం
సిద్దిపేట టౌన్, నవంబరు 29 : పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం మండిపడ్డారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని మంత్రి హరీశ్రావు నివాసంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై ధ్వజమెత్తారు. బీజేపీ కేంద్రంలో ఒకలా, రాష్ట్రంలో మరొకలా ప్రవర్తిస్తున్నదన్నారు. పెట్రోల్, డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ విమర్శించడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. బీజేపీ నిర్ణయాలు దేశంకోసం, ధర్మం కోసం కాదని అదాని, అంబానీల వంటి కార్పొరేట్ శక్తుల బాగుకోసమేనని దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16 సార్లు పెట్రోల్ ధరలు పెంచి కంటి తుడుపు చర్యగా ఒక్కసారి తగ్గించిందన్నారు. ఇప్పటికైనా కేంద్రం ఎక్సైజ్ సుంకంపై సమగ్రమైన విధానాన్ని తీసుకరావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు ఇర్షాద్ హుస్సేన్, లోక లక్ష్మీరాజ్యం తదితరులు పాల్గొన్నారు.