50 వేల మంది స్త్రీలకు వింత కష్టం.. వయసు మీదపడ్డా పెళ్లిళ్లు కాకపోవడానికి కారణమేంటంటే..

ABN , First Publish Date - 2021-04-29T21:41:48+05:30 IST

పెళ్లీడొచ్చినా, వయసు మీద పడి 30 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కాని స్త్రీలు వేల సంఖ్యలో ఉన్నారంటే నమ్మగలరా? అబ్బాయిలకు ఈ సమస్య రావాలి కానీ, అమ్మాయిలకు రావడమేంటి? అందుకు కారణాలేంటి? అనే కదా మీ డౌటు.

50 వేల మంది స్త్రీలకు వింత కష్టం.. వయసు మీదపడ్డా పెళ్లిళ్లు కాకపోవడానికి కారణమేంటంటే..

భారత దేశంలో జరుగుతున్న బాల్య వివాహాల సంఖ్య తక్కువేమీ కాదు. ప్రభుత్వాలు, అధికారులు ఎంతగా కృషి చేస్తున్నా బాల్య వివాహాల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. చాలా మంది అమ్మాయిలకు పాతికేళ్ల లోపే పెళ్లి జరిగిపోతోంది. చదువు, ఉన్నతోద్యోగ కారణాల వల్ల మాత్రం అతి కొద్ది శాతం యువతులు పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటున్నారు. అయినప్పటికీ 30 ఏళ్ల వయసు మీద పడే లోపే వారికి కూడా పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. కానీ ఓ రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెళ్లీడొచ్చినా, వయసు మీద పడి 30 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కాని స్త్రీలు వేల సంఖ్యలో ఉన్నారు. ఇంతకీ ఆ రాష్ట్రం ఏంటి..? అబ్బాయిలకు ఈ సమస్య రావాలి కానీ, అమ్మాయిలకు రావడమేంటి? అందుకు కారణాలేంటి? అనే కదా మీ డౌటు. అక్కడికే వెళ్దాం. 


కశ్మీర్ లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో పెళ్లిళ్లు అవక, అవివాహితలుగా ఉంటున్న స్త్రీల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోందట. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 50 వేల మంది స్త్రీలు కశ్మీర్ లో పెళ్లిళ్లు కాకుండా పుట్టింట్లోనే ఉండిపోయారు. ఒక్క శ్రీనగర్ జిల్లాలోనే 10 వేల మంది మహిళలకు పెళ్లిళ్లు కాకుండా ఉండిపోయారని ఇటీవల ఓ సర్వేలో వెల్లడయింది. తెహ్రీక్ ఈ ఫలా ఉల్ ముస్లిమీన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అయితే ఇలా పెళ్లిళ్లు జరగకుండా ఉండిపోవడానికి ఆర్థిక కారణాలు మాత్రమే కారణం అనుకుంటే పొరపాటేనని ఆ సంస్థ వ్యవస్థాపకుడు అబ్దుల్ రషీద్ నాయక్ చెబుతున్నారు. 


‘మా పక్కింటి వాడు తన కూతురిని మంచి ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేశాడు. నేను కూడా అంతకుమించిన సంబంధం తెచ్చి మా అమ్మాయికి పెళ్లి చేయాలి’ అని భావించి పెళ్లిని ఆలస్యం చేస్తూ వచ్చిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయని అబ్దుల్ రషీద్ చెప్పుకొస్తున్నారు. ఇలా ఏళ్లు గడుస్తూ వయసు మీద పడిపోయి అసలు పెళ్లే కాకుండా యువతులు ఉండిపోతున్నారని ఆయన వాపోతున్నారు. ఈ తరం కుర్రాళ్లలో అత్యధిక శాతం మంది చదువుకున్న అమ్మాయిలనో,  ఏదో ఒక ఉద్యోగం చేసే యువతులనో మాత్రమే పెళ్లిళ్లు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారని తమ పరిశోధనలో వెల్లడయిందంటున్నారు. చదువు లేకుంటే అధిక కట్నాలు అడుగుతున్నారనీ, అంత మొత్తంలో ఇచ్చుకోలేక కూడా పెళ్లిళ్లు జరగడం లేదని తేలిందంటున్నారు. ఏది ఏమైనా సమాజంలో వస్తున్న మార్పుల వల్ల పెళ్లిళ్లు కాకుండా పుట్టింట్లోనే కాలం గడుపుతున్న యువతుల సంఖ్య పెరుగుతుండటం శోచనీయమని వాపోయారు.

Updated Date - 2021-04-29T21:41:48+05:30 IST