ఉద్యోగుల హక్కుల సాధనకు ఉద్యమాలే శరణ్యం
ABN , First Publish Date - 2021-12-06T06:26:45+05:30 IST
ఉద్యోగ, ఉపాధ్యాయ హక్కుల సాధనకు ఉద్యమాలే శరణ్యమని పట్టభద్రుల ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి తేల్చిచెప్పారు.
ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి
తొట్టంబేడు, నవంబరు 5: ఉద్యోగ, ఉపాధ్యాయ హక్కుల సాధనకు ఉద్యమాలే శరణ్యమని పట్టభద్రుల ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి తేల్చిచెప్పారు. ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణ కొత్తపేట జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో మండల మహాసభ, కౌన్సిల్ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా యండపల్లి మాట్లాడుతూ... అధికారంలోకి రాగానే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామనీ, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామనీ, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ హామీఇచ్చారని చెప్పారు. అధికారంలోకి వచ్చి రెండన్నరేళ్లు గడుస్తున్నా ఒక్క హామీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. సీపీఎస్ రద్దుకు సంబంధించి శాసనసభలో తీర్మానం చేయాలంటూ తాము నిరసనకు దిగినా పట్టించుకోలేదన్నారు. పోలీసుల సహకారంలో ఉద్యమాలను ఆపలేరన్న నగ్నసత్యాన్ని ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. జాతీయ విద్యావిధానం పేరిట పాఠశాలలను విలీనం చేయడం ప్రాథమికవిద్యను బలహీనపరచడమే అన్నారు. రోజుకో యాప్ అమలుతో ఉపాధ్యాయులకు సంబంధిత వివరాల నమోదుకు సమయం సరిపోతోందని వాపోయారు. సమావేశంలో యూటీఎఫ్ నాయకులు రమేష్, సూర్యప్రకాష్, శ్రీనివాసులు, గుణశేఖర్రెడ్డి, మఽధు, ఎస్ఎస్నాయుడు, నిర్మల, జయంతి, సుజాత, దామోదరంశెట్టి, రాఘవ, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.