బాబోయ్.. పనిచేయలేం..!
ABN , First Publish Date - 2020-12-04T06:26:53+05:30 IST
ఇందుకు అనేక ఉహాగానాలు వినిపిస్తున్న ప్పటికీ.. రాజకీయ ఒత్తిళ్లే ప్రధాన కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
రాజకీయ ఒత్తిళ్లతో నలిగిపోతున్న అధికారులు
బదిలీలు.. లాంగ్ లీవ్లకు మొగ్గు
మొన్నటి వరకు.. నరసాపురం తహసీల్దార్ కార్యాలయంలో పని చేసేందుకు అధికారులు పోటీ పడేవారు. డివిజన్ కేంద్రం కావడం, పట్టణం, మండలాలు రెండు కలిసి ఉండడంతో పరిధి ఎక్కువ. ఇక్కడ పనిచేస్తే ప్రొటోకాల్ నుంచి రెవెన్యూ అంశాల వరకు మంచి అనుభవం వస్తుందని ఉద్యోగుల అభిప్రాయం. అందుకే పోస్టింగ్ కోసం లాబీయింగ్ చేసేవారు.
కానీ, ప్రస్తుతం..సీన్ మారింది. ఇక్కడ పోస్టింగ్ అంటే అధికారులు అమ్మో అంటున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నరలో ఇన్ఛార్జిలతో కలిపి ఐదుగురు తహసీల్దార్లు మారారు. ఎవరూ పట్టుమని నాలుగు నెలలు పని చేయడం లేదు. ఏదో కారణం చూపి సెలవుపై వెళ్లిపోతున్నారు.
నరసాపురం : ఇందుకు అనేక ఉహాగానాలు వినిపిస్తున్న ప్పటికీ.. రాజకీయ ఒత్తిళ్లే ప్రధాన కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో అనేక సబ్ డివిజన్లలో పనిచేసిన.. సీనియర్ అధి కారి నాగార్జునరెడ్డి ఎన్నికలైన తర్వాత ఇక్కడ తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టారు. కానీ మూడు నెలలు కూడా పనిచేయలేదు. దీర్ఘకా లిక సెలవుపై వెళ్లిపోయారు. దీనిపై అనేక ఊహాగానాలు వినిపించాయి. అనధికారికంగా చెరువుల తవ్వకాలపై ఆయన కఠినంగా ఉండటంతో కొందరు పెద్దలకు రుచించలేదు. అనుమతుల కోసం ఒత్తిళ్లు తేవడంతో సెలవుపై వెళ్లారన్న వాదనలు వినిపించాయి. రెవెన్యూ శాఖలో దీర్ఘకాల అనుభవం వున్న రవికుమార్కు నాగార్జునరెడ్డి తర్వాత ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు. ఆయన మూడు నెలలు పనిచేశారు. స్థలాల కొనుగోలుపై అనేక ఒత్తిళ్లు రావడంతో హఠాత్తుగా సెలవు పెట్టేసినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగిం ది. ఆ తర్వాత కార్యాలయంలో డీటీ బేగంకు ఇన్ఛార్జ్ బాధ్యత లు అప్పగించారు. ఆమె నెల రోజులు పనిచేశారు. ఆ తర్వాత యలమంచిలి డీటీగా ఉంటున్న నరేష్కుమార్కు ఇక్కడ ఇన్ చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ పోస్టింగ్ ఇచ్చారు. ఆయన రెండు నెలలు మాత్రమే పనిచేశారు. ముక్కుసూటిగా వెళుతుండ టంతో కొందరికి నచ్చలేదు. పనిలో వేగవంతం లేదన్న సాకు ను చూపి ఆయనను మార్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే సమయంలో గతంలో ఇక్కడ పనిచేస్తూ సెలవుపై వెళ్లిన రవికుమార్ మళ్లీ ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. ఇళ్ల పట్టాలకు సంబంధించిన భూముల సేకరణపై కొందరు నాయకులు తీవ్ర ఒత్తిళ్లు తీసుకొచ్చారు. ఆయన ససేమిరా అనడంతో బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో మళ్లీ మల్లికార్జునరెడ్డికి పోస్టింగ్ ఇచ్చా రు. మూడు నెలల నుంచి ఆయన ఇక్కడ పని చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయ చరిత్రలో తక్కువ కాలంలో ఇంతమంది బదిలీ కావడం ఇదే తొలిసారి. దీనిపై ఉద్యోగ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
మునిసిపాలిటీలోనూ ఇదే సీన్
పురపాలక సంఘంలోనూ ఇదే సీన్ నెలకొంది. ఏడాదిన్న రలో ఇద్దరు డీఈలు బదిలీపై వెళ్లిపోయారు. ఎన్నికల తరు వాత ఇక్కడ పనిచేస్తున్న లక్ష్మీనారాయణ కృష్ణా జిల్లా నూజి వీడు వెళ్లారు. ఖాళీ అయిన ఆ స్థానంలో రాజమహేంద్ర వరంలో పనిచేస్తున్న సూర్యప్రకాశ్తో భర్తీచేశారు. ఆయన ఐదు నెలలు కూడా పనిచేయలేదు. తిరిగి రాజమహేంద్రవ రం వెళ్లిపోయారు. దీంతో ఖాళీ అయిన ఈ స్థానంలో మండ పేటలో పనిచేస్తున్న వరప్రసాద్ను నియమించారు. ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారు. ఇలా ఏడాదిన్నర కాలంలో ఇద్దరి డీఈలు వెళ్లిపోవడంపై పురపాలక వర్గాల్లో అసక్తికర చర్చ సాగుతుంది. జనరల్ ఫండ్స్ లేకపోవడం, ప్రతిపాదించిన పనులు ముందుకు సాగకపోవడంతో ఇంజనీరింగ్ అధికారు లపై ఒత్తిళ్లు పెరిగాయి. ఈ కారణంగానే డీఈలు బదిలీ అవుతున్నారన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి.
ఓ గ్రామానికి చెందిన ఎస్సీ మహిళ తనపై కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇవతల వర్గం వెంటనే యువనేతను ఆశ్రయించింది. అంతే పోలీసు స్టేషన్కు ఫోన్ వచ్చేసింది. వీరిపై ఎటువంటి చర్య తీసుకోరాదని.. దెబ్బకు పోలీసులు మౌనం వహించారు. కానీ, అధికార పార్టీలో మాత్రం దుమారం రేగింది. తప్పు చేసిన వ్యక్తులను వెనకేసుకు రావడం ఏమిటని ? అయినా మా గ్రామంలో మాకు తెలియకుండానే నేరుగా వివాదాల్లో ఎలా వేలు పెడతారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.