ఎంటీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు
ABN , First Publish Date - 2022-04-07T15:19:51+05:30 IST
రాజధాని నగరం చెన్నైలో మెట్రోపాలిటన్ కార్పొరేషన్ (ఎంటీసీ) నడుపుతున్న బస్సుల్లో ప్రయాణికులకు భద్రత కల్పించేలా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను బుధవారం ఎంటీసీ అధికారులు
ప్యారీస్(చెన్నై): రాజధాని నగరం చెన్నైలో మెట్రోపాలిటన్ కార్పొరేషన్ (ఎంటీసీ) నడుపుతున్న బస్సుల్లో ప్రయాణికులకు భద్రత కల్పించేలా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను బుధవారం ఎంటీసీ అధికారులు ప్రారంభించారు. ఈ బస్సుల్లో మహిళలు, విద్యార్థినులపై జరిగే వేధింపులు అడ్డుకొనే దిశగా ‘పానిక్ బటన్’ను పొందుపరిచారు. ప్రయాణం సమయంలో వేధించబడే మహిళలు ఈ బటన్ నొక్కితే ట్రాఫిక్ కార్యాలయంలోని కంట్రోల్ రూంకు సమాచారం అందుతుంది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకొని వేధింపులకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుంటారు. అలాగే, రద్దీ ప్రాంతాల్లో జరిగే జేబు దొంగతనాలు, ప్రయాణంలో హఠాత్తుగా అనారోగ్యానికి గురైన వారి కోసం పానిక్ బటన్ ఏర్పాటుచేశారు. ఈ ప్రత్యేక వసతుల కల్పనతో ఇకపై ఎంటీసీ బస్సుల్లో మహిళలు, విద్యార్థినులపై జరిగే వేధింపులతో పాటు నేరాలను అడ్డుకొనే అవకాశముందని అధికారులు తెలిపారు. ఎంటీసీ నగరంలో 200 వార్డులు, శివారు ప్రాంతాలను కలుపుతూ సుమారు 2 వేలకు పైగా సిటీ బస్సులు నడుస్తున్న విషయం తెలిసిందే. కొన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, మరికొన్నింటిలో ఏర్పాటు చేయాల్సివుందని అధికారులు తెలిపారు.