ఎవరి ఇష్టం వారిదే!
ABN , First Publish Date - 2021-08-15T05:21:04+05:30 IST
శ్రీకాళహస్తి ఆలయ సిబ్బంది సమయపాలన పాటించక పోవడంపై విమర్శలు వస్తున్నాయి.
శ్రీకాళహస్తి అర్బన్, ఆగస్టు 14: ఇక్కడ ఎవరి ఇష్టం వారిదే. ఏ సమయంలో ఎవరు విధులకు వస్తారో తెలియదు. ఎంత ఆలస్యంగా వచ్చినా పట్టించుకునే వారు లేరు. రిజిస్టర్లో సంతకం ఉంటే చాలు. ఇదీ ముక్కంటి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తీరు. రెండేళ్ల కిందటి వరకు ఆలయ ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ షిఫ్టుల వారీగా విధులకు హాజరయ్యే వారు. అయితే ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైనా ఇక్కడ బయోమెట్రిక్ విధానం అమలు లేకపోవడం విశేషం. పాత పద్ధతిలో అటెండెన్స్ రిజిస్టర్లను అందుబాటులో ఉంచారు. దీంతో అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించకుండా తీరిగ్గా వచ్చి సంతకాలు చేసి మరీ వెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఒకరే ఐదారుగురి సహచరుల సంతకాలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ముక్కంటి ఆలయంలో బయోమెట్రిక్ విధానం అమలు చేయాల్సి ఉంది. తరచూ పర్యవేక్షణ చేస్తూ ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటే భక్తులకు మెరుగైన సేవలు అందుతాయి.