ముంగెర్ ఘటనపై సీఐఎస్ఎఫ్ సంచలన నివేదిక
ABN , First Publish Date - 2020-10-30T20:47:06+05:30 IST
దుర్గామాత విగ్రహ నిమజ్జనం సందర్భంగా ఈనెల 26న ముంగెర్లో చోటుచేసుకున్న కాల్పుల ఘటన చుట్టూ రాజకీయం ముసురుకుంటున్న..
పాట్నా: దుర్గామాత విగ్రహ నిమజ్జనం సందర్భంగా ఈనెల 26న ముంగెర్లో చోటుచేసుకున్న కాల్పుల ఘటన చుట్టూ రాజకీయం ముసురుకుంటున్న నేపథ్యంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా సంస్థ (సీఐఎస్ఎఫ్) ఇందుకు సంబంధించిన నివేదక ఇచ్చింది. ఈ నివేదికను ఎన్నికల కమిషన్కు సీఐఎస్ఎఫ్ సమర్పించినట్టు ఐఏఎన్ఎస్ ఒక వార్తాకథనంలో పేర్కొంది. పరిస్థితి అదుపు తప్పడంలో స్థానిక పోలీసులే తొలుత కాల్పులు జరిపారని, ఆ తర్వాత సీఐఎస్ఎఫ్ గాలిలోకి కాల్పులు జరిపిందని ఆ నివేదిక పేర్కొంది.
నివేదక ప్రతిలోని సమాచారం ప్రకారం, నిమిజ్జనం ఊరేగింపు వేగాన్ని నెమ్మదింపచేయడంతో పోలీసులకు, భక్తులకు మధ్య వాగ్యుద్ధం మొదలైంది. ఆ క్రమంలో కొందరు స్థానికులు పోలీసు పార్టీపై రాళ్లు రువ్వారు. ఇందుకు ప్రతిగా స్థానిక పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. దీంతో ఆగ్రహం చెందిన స్థానికులు మరింత ఉధృతంగా రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకు సీఐఎస్ఎఫ్కు చెందిన ఎం.గంగయ్య అనే వ్యక్తి ఇన్సాస్ రైఫిల్ నుంచి గాలిలోకి 13 రౌండ్లు కాల్పులు జరిపినట్టు నివేదిక తెలిపింది.
కాగా, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, తమ బలగాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని, దహనకాండకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటామని డీఐజీ మను మహరాజ్ మీడియాకు తెలిపారు. అక్టోబర్ 26న జరిగిన ఘటనలో వ్యక్తి మృతికి కారణంపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
మరోవైపు, పూరబ్ సరాయ్ పోలీస్ స్టేషన్ నుంచి 100 రౌండ్ల బుల్లెట్లు, రెండు మ్యాగజైన్లు మాయమైనట్టు ముంగెర్ పోలీసులు శుక్రవారంనాడు తెలిపారు. పోలీసు చర్యపై అసంతృప్తితో ఉన్న ఆందోళనకారులు పూరబ్ సరాయ్ పోలీస్ స్టేషన్ను గురువారంనాడు ధ్వంసం చేశారు. అయితే, సోమవారం రాత్రి ఘటనలో పోలీసులే కాల్పులు జరిపారని, ఆ కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి చెందగా, పలువురు గాయపడినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే, సంఘ వ్యతిరేక శక్తులే ఈ కాల్పులు జరిపారని, పోలీసులు కాదని బీహార్ పోలీసులు కొట్టిపారేశారు.