హైదరాబాద్లో నడిరోడ్డుపై వెంటాడి, వేటాడి...
ABN , First Publish Date - 2021-04-02T07:19:34+05:30 IST
బుల్లెట్పై వెళ్తున్న ఓ రౌడీషీటర్ను
- హైదరాబాద్లో హత్యల కలకలం
- వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి దారుణ హత్య
- పాతబస్తీలో పట్టపగలు కత్తులతో వేట
- పాతకక్షల నేపథ్యంలో రౌడీషీటర్ హత్య
- కార్మికనగర్ అపార్ట్మెంట్లో మరో కలకలం
- హత్య చేసి శవాన్ని ప్రిడ్జ్లో పెట్టిన దుండగుడు
- చిక్కడపల్లిలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి హత్య
- చాకుతో పీక కోసి ఆగంతకుడి పరార్
చిన్నా, పెద్దా తేడా లేదు.. కారణాలు ఎలాంటివైనా కావొచ్చు.. నేరాలు చేయడంలో ఇంతకు ముందెన్నడూ సామాన్యులలో లేని తెగింపు కొంత కాలంగా కనిపిస్తోంది. జంకూ, గొంకూ లేకుండా హత్యలు చేయడానికి రంగంలోకి దిగుతున్నారు. వీరంతా నేరాలు చేయడానికి అలవాటు పడిన వారు, కరుడుగట్టిన నేరగాళ్లు కాదు. అయినా ఏదో ఉన్మాదం, ఏదో ఆవేశం, మరేదో కారణం వీరిని నేర ప్రపంచంలోకి నిర్భయంగా అడుగుపెట్టేలా చేస్తున్నాయి. కొత్త హంతకులను తయారుచేస్తున్నాయి.
నడిరోడ్డుపై హత్య
పట్టపగలు కత్తులతో పొడిచి చంపిన దుండగులు
హసన్నగర్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి) : బుల్లెట్పై వెళ్తున్న ఓ రౌడీషీటర్ను ప్రత్యర్థులు ఆటోలో వెంబడించి పట్టపగలు కత్తులతో పొడిచి చంపారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. మైలార్దేవుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని వట్టేపల్లి ఇండియా ఫంక్షన్ హాల్ సమీపంలో గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు జరిగింది. పోలీసులు, స్థానికులు, హతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... శాస్త్రీపురం డివిజన్ పరిధి వట్టేపల్లిలో నివాసం ఉండే అసద్ఖాన్ (48) రియల్టర్. ఇతనిపై మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉంది. 2018లో వట్టేపల్లికి చెందిన మహ్మద్ అంజద్ హత్యకేసులో అసద్ఖాన్ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. ఆ కేసులో అసద్ఖాన్ జైలుకు వెళ్ళి వచ్చాడు. సంవత్సరం పాటు పీడీ యాక్టు అనుభవించాడు. అసద్ ఖాన్కు ఇద్దరు భార్యలు, ఐదుగురు సంతానం. గురువారం మధ్యాహ్నం అసద్ఖాన్ తన బుల్లెట్ వాహనంపై వట్టేపల్లి ఇండియా ఫంక్షన్ హాల్ వైపు వెళ్తుండగా, ఆటోలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. అసద్ఖాన్ మరణించే వరకు పొడిచి పొడిచి చంపారు. తలను ఛిద్రం చేశారు. అనంతరం కత్తులను అక్కడే పారేసి ఆటోలో రాంగ్రూట్లో పారిపోయారు. సమాచారం అందుకున్న మైలార్దేవుపల్లి ఇన్స్పెక్టర్ కె.నర్సింహ్మ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం శంషాబాద్ డీసీపీ ఎన్.ప్రకాశ్రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ ఆర్.సంజయ్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. క్లూస్ టీం బృందం వేలిముద్రలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అసద్ఖాన్ హత్యకు కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నామని డీసీపీ తెలిపారు. అసద్ఖాన్ బావమరిది నజీర్ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ నర్సింహ్మ తెలిపారు.
టైౖలర్ దారుణ హత్య.. ఫ్రిడ్జిలో శవం..
టైలర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తి అతని ఇంట్లోకి చొరబడి కత్తితో కడుపులో పొడిచి చంపేశారు. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు మృతదేహాన్ని కర్టెన్లో చుట్టి బయటకు తరలించేందుకు ప్రయత్నించారు. ఫ్రిడ్జిలో పెట్టేందుకు కూడా చూశారు. కుదరకపోవడంతో అక్కడే వదిలేసి బయటి నుంచి తాళం వేసి పారిపోయారు. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నాటక జిల్లా కొహిర్కు చెందిన మహ్మద్ సిద్దిఖ్ అహ్మద్ (45) కూకట్పల్లిలో టైలర్గా పనిచేస్తున్నాడు. యూసుఫ్గూడ సమీపంలోని కార్మికనగర్లో ఓ అపార్ట్మెంట్ మొదటి అంతస్థులో భార్య ముబీనీ బేగం, కుమార్తె రుకీయా, కుమారుడు సుభాన్తో కలిసి ఉంటున్నాడు. మార్చి 28న భార్య పిల్లలను తీసుకొని శ్రీరాంనగర్లో ఉంటున్న పుట్టింటికి వెళ్లింది. సిద్దిఖ్ రోజూ విధులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సమయంలో అత్తింట్లో వెళ్లి భోజనం చేసేవాడు. బుధవారం రాత్రి కూడా అక్కడ భోజనం చేసి ద్విచక్ర వాహనంపై అపార్ట్మెంట్కు చేరుకొని ఫ్లాట్లోకి వెళ్లాడు. గురువారం ఉదయం అతని ఫ్లాట్కు బయటి నుంచి తాళం వేసి ఉండటంతో విధుల్లోకి వెళ్లాడని అందరూ అనుకున్నారు. సాయంత్రం సమయంలో సిద్దిఖ్ ఫ్లాట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో అపార్ట్మెంట్ యజమాని, స్థానికులతో కలిసి జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఫ్లాట్ తెరిచి చూడగా వంట గదిలోని ఫ్రిడ్జి వద్ద సిద్దిఖ్ మృత దేహం పడి ఉంది. అతని కడుపులో కత్తితో పొడవటంతో పాటు తల మీద బలమైన వస్తువుతో బాదినట్లు ఆనవాళ్లు లభించాయి. సిద్దిఖ్ను చంపిన తర్వాత కర్టెన్లో పెట్టి తరలించేందుకు ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు. ఫ్రిడ్జిలో పెట్టేందుకు ప్రయత్నించారు. అతనిది భారీ శరీరం కావడంతో కుదరలేదు. దీంతో మృతదేహాన్ని అక్కడే వదిలేసి బయటి నుంచి తాళం వేసి నిందితులు పారిపోయారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్రెడ్డి క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు.
సీసీ కెమెరాలో నిందితుడి ఫుటేజీ
సిద్దిఖీ ఫ్లాట్కు వచ్చాక కొద్ది సేపటికి గుర్తు తెలియని వ్యక్తి వచ్చినట్టు సీసీ కెమెరాలో రికార్డు అయింది. గురువారం తెల్లవారు జాము 4 గంటల వరకు ఉన్న నిందితుడు ఫ్లాట్కు తాళం వేసి హతుడి ద్విచక్ర వాహనం వేసుకొని పారిపోయాడు. సీసీ కెమెరాలో నిందితుడు చిత్రం ద్వారా అతన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సిద్దిఖ్కు రోజూ భార్యతో గొడవ జరిగేదని స్థానికులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం ఆమె భర్తతో గొడవ పడ్డాక ఇళ్లు వదిలి వెళ్లిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముబీనా బేగంను ప్రశ్నిస్తున్నారు. సిద్దిఖ్ హత్యకు ఆస్తి తగాదాలు లేక వివాహేతర సంబంధాలా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. తెలిసిన వ్యక్తి హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృత దేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.
మిస్టరీ
ఎనిమిది సంవత్సరాల కిందట వివాహం చేసుకున్న దంపతులు ఏడాదిన్నర నుంచి సూర్యానగర్లోని ఓ ఇంటిలో నివాసం ఉంటున్నారు. సద్నామ్సింగ్ వద్ద సహాయకుడిగా ఉంటున్న నిషాంత్సింగ్ గత రాత్రి నుంచి కనిపించడం లేదు. పోలీసులు అతడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. నిషాంత్ సింగ్ను ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక ఆయనే ఈ హత్యకు కారకుడా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంఘటనాస్థలాన్ని క్లూస్టీమ్, జాగిలాలు తనిఖీలు చేసి ఆధారాలు సేకరించాయి. హత్య గత రాత్రే జరిగినా, మర్నాడు మధ్యాహ్నం వరకు విషయం బయటకు పొక్కకపోవడంతో ఈ మర్డర్ మిస్టరీగా మారింది.
కీలకం కానున్న సీసీ ఫుటేజీలు
సద్నామ్సింగ్ హత్య ఎప్పుడు జరిగింది, ఎవరు చేశారనేది తేల్చడంలో సీసీ ఫుటేజీలు కీలకంగా మారనున్నాయి. సద్నామ్సింగ్తో ఎవరికైనా పాతకక్షలున్నాయా, డబ్బుల విషయంలో గొడవలు జరిగాయా అనే కోణంలో కూడా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.