నయీం డైరీల గుట్టు విప్పించాలి.. : గవర్నర్కు లేఖ
ABN , First Publish Date - 2021-06-13T12:58:16+05:30 IST
గ్యాంగ్స్టర్ నయీం డైరీల్లోని సమాచారం బహిర్గతం చేసేందుకు
హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీం డైరీల్లోని సమాచారం బహిర్గతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్కు ఫోరం ఫర్ గుడ్గవర్నెన్స్(ఎఫ్జీజీ) లేఖ రాసింది. డైరీల్లోని విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో ఎఫ్జీజీ కార్యదర్శి ఎం. పద్మనాభ రెడ్డి పేర్కొన్నారు. ఎన్కౌంటర్లో నయీం చనిపోయిన తర్వాత నిర్వహించిన తనిఖీల్లో 130 డైరీలు, 602 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారన్నారు. 250 కేసులు నమోదు చేసిన పోలీసులు, ఏ కేసులోనూ డైరీల్లో ఉన్న అంశాల్ని సాక్ష్యాలుగా ప్రస్తావించలేదన్నారు. డైరీలను కోర్టులో డిపాజిట్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, అందులోని విషయాల్ని బహిర్గతం చేయాలని కోరారు. డైరీల్లోని సమాచారాన్ని రహస్యంగా ఉంచి దర్యాప్తు పక్కదారి పట్టించారన్నారు. పోలీసు అధికారులు, రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నందున కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా డైరీల్లోని సమాచారం వెల్లడించేలా చూడాలని కోరారు.