పంజ్షీర్లో 600 మంది తాలిబన్ మిలటెంట్లు హతం!
ABN , First Publish Date - 2021-09-05T16:30:39+05:30 IST
అఫ్ఘానిస్తాన్ను ఆక్రమించుకున్న తాలిబన్లు...
కాబుల్: అఫ్ఘానిస్తాన్ను ఆక్రమించుకున్న తాలిబన్లు అనునిత్యం అరాచకాలకు పాల్పడుతున్నారు. అఫ్ఘానిస్తాన్ లోని పంజ్ షీర్ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని తాలిబన్లు ప్రకటించారు. అయితే ఇంతలోనే పంజ్షీర్ తిరుగుబాటు దళం... తాలిబన్ల ప్రకటనను తీవ్రంగా ఖండించింది. తాలిబన్లతో యుద్ధం కొనసాగుతున్నదని... పంజ్షీర్ ఇంకా వారికి లొంగిపోలేదని తెలిపింది. పంజ్షీర్ తిరుగుబాటు దళం తాజాగా మరో ప్రకటన చేసింది.
600 మంది తాలిబన్ ఫైటర్లను పంజ్షీర్ యోధులు అంతమొందించారని ప్రకటించింది. అలాగే వెయ్యి పైగా తాలిబన్లు తమకు లొంగిపోయారని వెల్లడించింది. ఈ ప్రకటన పంజ్షీర్ తిరుగుబాటు దళ ప్రతినిధి ఫహీం దష్టి నుంచి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాగా పంజ్షీర్పై ఆధిపత్యం సాధించామని తాలిబన్లు... వారు చేస్తున్న దాడులను తిప్పికొడుతున్నామని పంజ్షీర్ నేతలు చేస్తున్న ప్రకటనలతో గందరగోళం నెలకొంది. దీంతో వాస్తవ పరిస్థితి ఏమిటనే చర్చ జోరుగా సాగుతోంది.