హరితహారాన్ని నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2020-02-28T11:15:46+05:30 IST
హరితహారంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో గురువారం హరితహారంపై నిర్వహించిన జిల్లా అధికారుల సమావేశం నిర్వహించారు.
ఐదుగురు సర్పంచ్లకు షోకాజ్ నోటీసులు
కలెక్టర్ శ్రీధర్
నాగర్కర్నూల్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి) : హరితహారంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో గురువారం హరితహారంపై నిర్వహించిన జిల్లా అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరితహారాన్ని నిర్లక్ష్యం చేసిన ఐదుగురు సర్పంచ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బల్మూరు మండలం కొండారెడ్డిపల్లి 25శాతం, తెలకపల్లి మండలం అనంతసాగర్ 25శాతం, పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ 27శాతం, నక్కలపల్లి 42శాతం, లింగాల మండలం రాయవరం 46శాతం మొక్కలు మాత్రమే బతకడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ గ్రామాల సర్పంచ్లకు షోకాజ్ నోటీసుల జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా చట్ట ప్రకారం వీరితోపాటు పంచాయతీ కార్యదర్శులకు శాఖపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇంతేకాక జిల్లాలో మరో 42 గ్రామ పంచాయతీల్లో హరితహారం మొక్కలు బతికి శాతం తక్కువగా ఉన్నందున ఆయా గ్రామాల సర్పంచ్లకు హెచ్చరికలతో కూడిన మెమోలను జారీ చేశారు. అనంతరం కరెంటు బిల్లుల చెల్లింపులు, ట్రాక్టర్ ట్రాలీలు, ట్యాంకర్ల కొనుగోలు, పల్లె ప్రగతి పనుల పురోగతి, వైకుంఠధామాల స్థలాల గుర్తింపు, చెత్తను వేరు చేసే షెడ్లు, నర్సరీల పురోగతిపై సమీక్షించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు మనుచౌదరి, హన్మంతురెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్మోహన్, డీఆర్డీవో సుధాకర్, డీఈవో గోవిందరాజులు, జిల్లాలోని ఆర్డీవోలు, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఏపీడీవోలు పాల్గొన్నారు.