నిధుల మళ్లింపుపై ఆగ్రహం
ABN , First Publish Date - 2021-11-30T04:59:24+05:30 IST
పంచాయతీల నిధుల దారి మళ్లింపుపై పలువురు సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్కు సర్పంచ్ల ఫిర్యాదు
తోటపల్లిగూడూరు, నవంబరు 29 : పంచాయతీల నిధుల దారి మళ్లింపుపై పలువురు సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధులు లేక తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి కలెక్టర్ చక్రధర్బాబుకు మండలంలోని ముంగలదొరువు, నరుకూరు, చిన్నచెరుకూరు, విలుకానిపల్లి, ఇస్కపాలెం, కొత్తపాళెం పంచాయతీల సర్పంచ్లు సోమవారం వినతిపత్రం అందజేశారు. 2021, ఫిబ్రవరిలో సర్పంచులుగా ఎన్నికయ్యాము. నాటి నుంచి నేటి వరకు వడ్డీలకు డబ్బులు తెచ్చి పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వారు పేర్కొన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 14వ ఆర్ధిక సంఘ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బకాయిలకు మళ్లించిందని.. కనీసం సర్పంచ్లకు ముందస్తుగా ఎటువంటి సమాచారం ఇవ్వకనే నిధులు మళ్లించడం ఎంతవరకు న్యాయమని బాధిత సర్పంచ్లు ప్రశ్నించారు. అంతేకాకుండా కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్ధిక సంఘ నిధులను కూడా మళ్లించడం జరిగిందని వారు వాపోయారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మికి కూడా వారు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచులు ఇంగిలేల వెంకట చైతన్యకుమార్, కవిత, శారద, భాస్కర్, పావని, పద్మావతమ్మ తదితరులు పాల్గొన్నారు.