నితీశ్కు 100-150 శవాలను లెక్కబెట్టకపోతే నిద్రపట్టదు : తేజస్వి యాదవ్
ABN , First Publish Date - 2021-01-14T15:59:58+05:30 IST
బిహార్లో శాంతిభద్రతల పరిస్థితి నానాటికీ దిగజారుతోందని రాష్ట్రీయ జనతా దళ్
పాట్నా : బిహార్లో శాంతిభద్రతల పరిస్థితి నానాటికీ దిగజారుతోందని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఆర్జేడీ ఎమ్మెల్యే బంధువుపై దాడి జరిగినట్లు మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో తేజస్వి గురువారం ట్విటర్ వేదికగా నితీశ్ కుమార్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రోజుకు 100 నుంచి 150 శవాలను లెక్కబెట్టకుండా నితీశ్ కుమార్ నిద్రపోరని ఆరోపించారు.
‘‘బిహార్లోని కల్తీ ప్రభుత్వంలో ఎవరికీ రక్షణ లేదు. బిహార్లో రోజుకు 100 నుంచి 150 శవాలను లెక్కబెట్టకుండా ముఖ్యమంత్రి, ఆయన డిప్యూటీలు నిద్రకు ఉపక్రమించలేరు’’ అని పేర్కొన్నారు. ‘‘ఆటవిక పాలన మహారాజు ఎందుకు మౌనంగా ఉన్నారు?’’ అని ప్రశ్నించారు. ‘ఆర్జేడీ ఎమ్మెల్యే అల్లుడిపై కాల్పులు’ అనే శీర్షికతో కూడిన వార్తా కథనాన్ని తేజస్వి షేర్ చేశారు.